వేములవాడ: డెబ్బై ఐదేండ్ల స్వాతంత్య్ర భారతావనిలో రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని, ఆ పరిణతి వచ్చిన సమాజాలు, దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, కాబట్టి మన దేశంలో కూడా ఆ పరిణతి రావాలని తాను కోరుకుంటున్నానని సీఎం కేసీఆర్ చెప్పారు. మన దగ్గర ఎన్నికలు రాగానే ఆగమాగమైతరని, అట్ల ఆగం కాకుండా, చెప్పుడు మాటలు నమ్మకుండా సొంతంగా ఆలోచించి ఓటేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వేములవాడలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు.
‘ఎన్నికలప్పుడు పోటీలో నిలిచిన అభ్యర్థుల గురించి, ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల గురించి మీరు మీ గ్రామాల్లో బాగా చర్చించి ఓటేయాలె. అప్పుడే రాయేదో.. రత్నమేదో తేల్తది. అట్ల కాకుండా ఆగమాగం ఓటేస్తే మన తలరాత తలకిందులైతది. మీ ఓటు వేములవాడ నియోజకవర్గ ఐదేండ్ల భవిష్యత్తును నిర్ణయిస్తది. వేములవాడ పట్టణానికి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నది. రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ గడ్డకు నేను శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఎందుకంటే జీవితంలో ప్రధాన ఘట్టమైన నా పెండ్లి ఇదే ఆలయంలో జరిగింది. అందుకే వేములవాడతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. వాస్తవానికి ఇక్కడ నిజాయితీ పరుడైన చెన్నమనేని రమేశ్ ఎమ్మెల్యేగా ఉండె. ఆయనను మార్చాల్సిన అవసరం లేకుండె. కానీ కోర్టులో దిక్కుమాలిన కేసుతో తేపతేపకు గడబిడ గడబిడగా ఉంటుంది. మళ్లా పరేషాన్ ఎందుకని, ఆయనను అంతకన్నా ఉన్నత పదవిలో పెట్టుకుందామని చల్మెడ లక్ష్మినరసింహారావుగారిని ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టినం’ అని సీఎం చెప్పారు.
‘బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. 15 ఏండ్లు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నం. కాంగ్రెస్ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 50 ఏండ్లు పాలించింది. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపింది. దాంతో 58 ఏండ్లు మనం పడరాని పాట్లు పడ్డం. ఆఖరికి జగమొండిగా ఉండి 33 పార్టీల మద్దతు సాధించి, ఆమరణ దీక్షకు కూసుంటే, సమ్మెలు చేస్తే దిగొచ్చి రాష్ట్రం ఇచ్చిండ్రు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. అంతకుముందు 50 ఏండ్లు కాంగ్రెస్ ఉన్నది. గతంలో ఎవరు ఏం చేసిండ్రో, ఏ పార్టీ సర్కారు ఏం చేసిందో ఆలోచించి ఓటేస్తెనే మంచి జరుగుతది. తెలంగాణ వచ్చిన్నాడు చెట్టుకొగలం, గుట్టకొగలం ఉన్నం. తర్వాత ఏం జేస్తే తెలంగాణ సమాజం బాగుపడతదని బాగా ఆలోచించి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినం. కాంగ్రెస్ పార్టీ రూ.200 ఇస్తున్న పెన్షన్ను రూ.1000 చేసినం. తర్వాత దాన్ని రూ.2 వేలు చేసుకున్నం. ఈసారి గెలిచినంక రూ.5 వేలు చేస్తనని నేను మనవి చేస్తున్నం. ఆడబిడ్డ పెండ్లి కోసం రూ.లక్ష ఇస్తున్నం. ఆడబిడ్డల ప్రసవానికి సర్కారు దవాఖానకు వెళ్తే ఇదివరకు నానా బాధలు ఉండె. ఇప్పుడు ఆ బాధలు పోయినయ్. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. మాతా మరణాలు, శిశు మరణాలు తగ్గినయ్’ అన్నారు.