బాన్సువాడ/బాన్సువాడ టౌన్, ఏప్రిల్ 2: సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం బాన్సువాడ పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. పట్టణంలోని ఒకటో వార్డు, మినీ ట్యాంక్బండ్ పరిసరాల్లో రూ.4 కోట్లతో చేపట్టిన మల్టీజనరేషన్ పార్క్, చిల్డ్రన్ పార్కు పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. పట్టణంలో పర్యటిస్తున్న సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని చూసిన ఫాతిమా అనే మహిళ రోడ్డుపైకి వచ్చింది. తమకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేసినందుకు రెండు చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపింది.
జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొంది. బాన్సువాడ డివిజన్ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ ప్రతినిధులు స్పీకర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం మాట్లాడుతూ.. అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు, వైద్య సిబ్బంది సమష్టిగా పనిచేసి ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయాలని సూచించారు. అనంతరం యాసంగిలో వరి పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు తమ ధాన్యాన్ని మద్దతు ధరకే అమ్ముకోవాలని స్పీకర్ సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.