హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ వ్యవస్థలు పేదల ప్రజలకు అండగా ఉండాలని గతంలో మీరు చెప్పిన మాటలు మూసీ బాధితులకు వర్తించవా..? అని ‘గాంధీ సరోవర్’ బాధిత చిన్నారులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని నిలదీశారు. ఈ మేరకు వారు రాహుల్గాంధీకి బుధవారం లేఖలు రాశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ, సామాన్య పౌరులకు అండగా నిలవాలని మీరు చెప్పే వ్యాఖ్యల పట్ల అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు.
దేశ ప్రజల గొంతుక వినాలని చెప్తున్న రాహుల్.. మూసీ ప్రాజెక్టు విషయంలో తమ గొంతుకను ఎందుకు వినడం లేదని ప్రశ్నించారు. ప్రజల సొమ్ము ఖర్చు చేసేటప్పుడు ప్రభుత్వాలు పారదర్శకంగా ఉండాలని రాహుల్ గతంలో చెప్పారని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థం చేసుకోకుండా కట్టే ప్రాజెక్టులతో ఏం లాభమని చిన్నారులు కాంగ్రెస్ అగ్రనేతను ప్రశ్నించారు.
పేదలు ఎన్నో కలలుగని కట్టుకున్న ఇండ్లను గాంధీ విగ్రహం కోసం కూల్చడం ఏమిటని బీఆర్ఎస్ నేత వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు. ‘ఎక్స్’ వేదికగా ఆయన ‘గాంధీ సరోవర్’ బాధిత చిన్నారులు రాహుల్గాంధీకి లేఖ రాస్తున్న ఫొటోలను పోస్టు చేశారు. జీవితం మొత్తం కష్టపడి దాచుకున్న డబ్బుతో కట్టుకున్న ఇండ్లను ‘గాంధీ సరోవర్’ కట్టడానికి ధ్వంసం చేయడం సరికాదని అన్నారు.
సీనియర్ సిటిజన్లు, ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులను వారి ఇండ్ల నుంచి బయటకు గెంటేయడం చూస్తుంటే గుండె పగులుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్రెడ్డి ఆయన వ్యాపార భాగస్వాములకు ఈ ప్రాజెక్టును అప్పగించేందుకు శుక్రవారం చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఇదే రోజు ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్కు గడువుగా విధించారని స్పష్టం చేశారు. ఈ విషయంలో పౌర సమాజం మొత్తం బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.