సిరిసిల్ల రూరల్/వేములవాడ రూరల్, జూన్ 24: అమ్మాయిని వేధించాడనే కారణంతో ఓ వ్యక్తిని కర్రలతో బాది హత్య చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో శుక్రవారం కలకలం రేపింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వేములవాడలోని తిప్పాపూర్కు చెందిన నాగుల వేణుగౌడ్(40) కొన్నేండ్లుగా యం త్రాలు, తాయత్తులు కడుతూ, జాతకాలు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు.
తనను వేధించాడంటూ ఓ యువతి ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వస్తున్నదని, ఈ విషయంపై మాట్లాడుదామని ఓ విలేకరి వేణుకు ఫోన్ చేసి చెప్పాడు. మధ్యాహ్నం వేణు, తన స్నేహితుడితో కలిసి సిరిసిల్లకు వచ్చాడు. ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ప్రాంతంలోని రైతు బజార్ సమీపంలో అప్పటికే వేచి ఉన్న కొందరు కర్రలతో వేణుపై దాడిచేశారు. గాయపడ్డ వేణును కుటుంబసభ్యులు కరీంనగర్ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందా డు. మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించారు. వేణుకు భార్య వైష్ణవి, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.