కామారెడ్డి : ‘ధనమేరా అన్నింటికి మూలం’ అని ఓ సినిమాలో సినీ కవి వర్ణించినట్లు డబ్బుల విషయంలో రక్తం పంచుకుని పుట్టిన సోదరులు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, హత్యలు జరుగుతున్నాయి. తమ్ముడి చేతిలో అన్న హత్య(Murder)కు గురైన సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. సీఐ నరేశ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణంలోని పాత బస్డాండ్ ప్రాంతంలో నివాసం ఉండే ఫాతిమాబీకి నలుగురు కుమారులు ఉన్నారు. అందులో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు కుమారులు సాదిక్, సలీం, అంజద్ల మధ్య తల్లి వద్ద ఉన్న డబ్బుల(Money) గురించి నిత్యం గొడవలు జరుగుతుండేవి. రాత్రి అన్న సాదిక్, తమ్ముడు అంజాద్ పాత బస్టాండ్ సమీపంలో మద్యం సేవించారు. మద్యం మత్తులో డబ్బుల విషయమై ఇద్దరు గొడవ పడ్డారు.
దీంతో తమ్ముడు అంజాద్ అన్న సాదిక్ పై దాడి చేశాడు. సాదిక్ పారిపోతుండగా అంజాద్ రాళ్లతో(Attacking with stones) దాడి చేస్తూ వెంబడించాడు. రాళ్లతో కొట్టడంతో సాదిక్ అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వెళ్లి వివరాలను సేకరించారు. డాగ్ స్కాడ్ సహాయంతో అంజాద్ను పోలీసులు పట్టుకున్నారు. సాదిక్ను అంజాద్ ఒక్కడే చంపాడా లేదా మరో సోదరుడి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు( Investigation) చేస్తున్నారు. సాదిక్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.