హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): నీళ్లిచ్చే కేసీఆర్ కావాల్నా? కన్నీళ్లు పెట్టిచ్చే మోదీ కావాల్నా? మునుగోడు ప్రజలు ఆలోచించుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీకి ఓటేస్తే.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్తాయని, కరెంట్ కంపెనీలను ప్రైవేటుపరం చేస్తారని చెప్పారు. మునుగోడులో పోలింగ్ బూత్కు వెళ్లేటప్పుడు ప్రతిఒక్కరూ గ్యాస్ బండకు దండం పెట్టి వెళ్లాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ తులం బంగారం ఇచ్చేందుకు సిద్ధపడినట్టు తెలిసిందని.. ఇస్తే అక్కాచెల్లెళ్లు తీసుకోవాలని, ఓటు మాత్రం కేసీఆర్కు, కారు గుర్తుకే వేయాలని కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు.. అమిత్ షా చెప్పినట్టే జరుగుతున్నదని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డిని గెలిపిస్తే నెలరోజుల్లో ప్రభుత్వాన్ని కూలుస్తామని అమిత్ షా చెప్పారని.. ఇప్పుడదే జరుగుతున్నదని తెలిపారు. చివరికి ఉద్యోగులను సైతం అవమానిస్తున్నారని, ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని అన్నారు. మోదీ ఇలాఖాలో నేటికీ చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలిపారు. టీ న్యూస్కు కేటీఆర్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఆయన మాటల్లోనే…
ప్రతి ఎన్నిక మాకు ప్రతిష్ఠాత్మకమే..
రాష్ట్రంలో అధికార పార్టీగా.. ఇక్కడ జరిగే ఏ ఎన్నికైనా మాకు ప్రతిష్ఠాత్మకమే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమిత్ షా సహా అనేక మంది కేంద్ర మంత్రులు వచ్చారు. ‘మున్సిపల్ ఎన్నికలకే అంతమంది వచ్చినప్పుడు.. మా రాష్ట్రంలో, మేం అభివృద్ధి చేసిన చోట, మేం చేసిన పనిని చెప్పుకోవడానికి, పాజిటివ్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి టీఆర్ఎస్ కార్యకర్తలుగా ఎమ్మెల్యేలు మునుగోడుకు వెళ్లడంలో తప్పేముంది? బీజేపీని అడ్డుకొనేందుకే సర్వశక్తులు ఒడ్డుతున్నాం.
దున్నపోతుకు సున్నం పూస్తే ఎద్దు కాదు..
రాజగోపాల్రెడ్డి గత నాలుగేండ్లలో మునుగోడుకు తిరిగి వెళ్లింది లేదు. 159 పంచాయతీలు ఉంటే దాదాపు 125 గ్రామాలకు ఆయన వెళ్లనే లేదు. అందుకే ఇప్పుడు ప్రచారం కోసం వెళ్తే ప్రజలు ఛీత్కరిస్తున్నారు. ఎమ్మెల్యేలు పట్టించుకుంటే నాలాంటివారు నియోజకవర్గాన్ని దత్తత తీసుకొనే అవసరం రాదు. రాజగోపాల్రెడ్డి పట్టించుకోకపోయినా నియోజకవర్గంలో ఎక్కడా పనులు ఆగలేదు. మిషన్ భగీరథ, కాకతీయ, పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ ఇలాంటివేవీ ఆగలేదు. రోడ్లు, డ్రైనేజీలు వంటి సదుపాయాలపై ఆయన పంచాయతీ శాఖ మంత్రికిగానీ, మున్సిపల్ మంత్రినైన నాకుగానీ ఒక్క వినతిపత్రం కూడా ఇవ్వలేదు. దీంతో అవి పరిష్కారం కాలేదు. అయినా.. కాంట్రాక్టర్ను, డబ్బు విసిరికొట్టి మునుగోడు ప్రజలను కొంటాను అనే అహంకారం రాజగోపాల్రెడ్డిలో ఉన్నది. ‘దున్నపోతుకు సున్నం పూస్తే ఎద్దు కాదు.. కాంట్రాక్టర్కు కలర్ వేస్తే రాజకీయ నాయకుడు కాదు’ అని ప్రజలు గుర్తించాలి. రాజగోపాల్రెడ్డికి చెందిన సుశీ ఇన్ఫ్రా నుంచి డబ్బులు పంపిణీ చేస్తే.. అది తన కొడుకు కంపెనీ అని, తనకు సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదం. ప్రజలు ఈ ఝూటా మాటలను నమ్మరు.
బీజేపీకి ఓటేస్తే జీఎస్టీ పెరుగుతుంది
చేనేతపై జీఎస్టీలో 2.5 శాతం రాష్ర్టానికి వస్తుంది.. బీజేపీ అధికారంలోకి వస్తే దానిని తిరిగి ఇస్తామని కేంద్రమంత్రి కిషన్రెడ్డి హామీ ఎలా ఇస్తారు? కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీయే కదా.. మొత్తం 5 శాతం రద్దు చేయొచ్చు కదా? బీజేపీకి ఓటేస్తే చేనేతపై జీఎస్టీని ఒప్పుకున్నట్టే అవుతుంది. మునుగోడులో బీజేపీ గెలిస్తే 5 శాతంగా ఉన్న జీఎస్టీ 12 శాతానికి, 18 శాతానికి పెరుగొచ్చు. బీజేపీకి బుద్ధి చెప్పాలంటే ఓటు ఒకటే మార్గం. మునుగోడులోని నేతన్నలు ఒక్క ఓటు కూడా బీజేపీకి వేయొద్దు. వారి డిపాజిట్ గల్లంతు కావాలి. అప్పుడే మోదీ దిగివచ్చి జీఎస్టీని రద్దు చేస్తారు. మోదీ ప్రభుత్వం మరో ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పడుతుంది. అందులో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుంది. అప్పుడు చేనేతపై జీఎస్టీని రద్దు చేస్తాం. డబుల్ ఇంజిన్ సర్కారని చెప్పుకునే రాష్ర్టాల్లో చేనేత ఆత్మహత్యలు పెరుగుతున్నయి. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో రెండేండ్లలో 50 మంది చేనేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకున్నరు. వీళ్లు చేనేత కార్మికుల సంక్షేమం, తెలంగాణ పరిపాలన గురించి మాట్లాడడం హాస్యాస్పదం. డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లో ఫ్లోరోసిస్ భూతం పట్టి పీడిస్తున్నది. కానీ తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినం.
బీజేపీకి ఓటేస్తే పొంచి ఉన్న ప్రమాదాలు
మునుగోడులో బీజేపీకి ఓటేస్తే ప్రమాదాలు పొంచి ఉన్నయి. మొదటిది వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్తయి. ప్రతి గంట గంటకూ లెక్కగట్టి కరెంట్ ఇస్తరు. వాళ్లు చెప్పిన రేటుకే కరెంట్ కొనుక్కోవాలి. రెండోది.. కరెంట్ కంపెనీలను ప్రైవేటుపరం చేస్తరు. పెట్రోల్ బంకుల్లాగే కరెంట్ బంక్లు వస్తయి. మొబైల్ రీచార్జిలాగే ఎప్పటికప్పుడు కరెంట్ రీచార్జి చేసుకోవాల్సి వస్తది. ఇప్పుడు కేంద్రం ఏమంటున్నా తెలంగాణలో రైతులకు న్యాయం చేస్తున్నం. కేంద్రం ధాన్యం కొనబోమని చెప్పినా.. మనం కొంటున్నం. కానీ రేపు బీజేపీ అధికారంలోకి వస్తే పరిస్థితి తారుమారైతది. కల్లాల దగ్గర కాంటా ఉండదు. ధాన్యం సేకరణ బంద్ అయితది. అంబానీలు, అదానీలు పెద్దపెద్ద వాళ్లు బయటికి వస్తరు. మీ కల్లాల్లోకి వాళ్లు వచ్చి తిష్టవేస్తరు. వాళ్లు చెప్పిన రేటుకే మీరు పంటను అమ్మాలి. కనీస మద్దతు ధర ఉండదు. కార్పొరేట్ శక్తులను రాష్ట్ర ప్రభుత్వాలే అడ్డుకోలేక పోతున్నాయి. ఇక రైతులు ఎలా అడ్డుకుంటారు? తెలంగాణపై కేంద్రం అన్నింట్లో వివక్షే చూపుతున్నది. చివరికి విద్యా సంస్థల విషయంలోనే అన్యాయమే చేసినది. కేంద్రం లెక్కప్రకారం ప్రతిజిల్లా కేంద్రంలో ఒక నవోదయను ఏర్పాటు చేయాలి. అంటే తెలంగాణలో 33 నవోదయ విద్యాలయాలు ఉండాలి. కానీ ఎన్నిసార్లు విన్నవించినా చేయలేదు. సంస్థాన్ నారాయణపూర్లో డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేస్తాం. నారాయణపేటలో కూడా తప్పకుండా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తాం.
మోదీని ఓటుతో దండించండి
ప్రజల్లో నిరాసక్తత పెరిగిపోతున్నది. ఒకప్పుడు ఉల్లిగడ్డ ధర పెరిగితేనే ప్రభుత్వాన్ని కూల్చిన ఘనత భారతదేశానిది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఎందుకింద నిరాసక్తత పెరిగిపోతున్నదో నాకైతే అర్థం కావడం లేదు. గ్యాస్ ధరలు పెరిగినా, పెట్రోల్ ధరలు పెరిగినా ప్రజల్లో స్పందన రావడం లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా సిలిండర్ ధర భారతదేశంలోనే ఉన్నది. ముడి చమురు ధర పెరగకపోయినా.. మోదీ చమురు ధర మాత్రం పెరిగింది. ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచినరని కొందరు అడుగుతున్నరు. పెట్రో ధరలు పెరిగితే ఆర్టీసీ చార్జీలు పెరుగుతయా? లేదా? చార్జీలే కాదు.. ఉప్పు, పప్పు.. ఇలా అన్ని ధరలు పెరుగతూనే ఉంటాయి. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలి. మునుగోడులో ఓటేసే ముందు గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి వెళ్లండి. ప్రజలపై మోయలేని భారాన్ని వేస్తున్న బీజేపీని ఓటుతో దండించండి.
ధరణిపై అపోహలు నమ్మొద్దు
తెలంగాణలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నరు. గతంలో వాళ్లను రెవెన్యూ వ్యవస్థ పీడించేది. ఇది అందరికీ తెలిసిన నిజం. పరపతి, పలుకుబడి ఉన్నోడు నచ్చినట్టు చేసుకునేటోడు. ఇవన్నీ ఆలోచించే.. వాళ్లందరికీ మేలు చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణిని తీసుకొచ్చారు. ఒకేరోజు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయిపోతున్నది. ఇదో గొప్ప సంస్కరణ. అయితే.. కొత్తగా ఏది తీసుకొచ్చినా బాలారిష్టాలు ఉంటాయి. అవన్నీ కామన్. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు. తప్పకుండా మార్పులు, చేర్పులు చేస్తాం. దీనికోసం క్యాబినేట్ సబ్ కమిటీ పనిచేస్తున్నది.
యాదాద్రికి రూపాయి ఇచ్చారా?
హిందూయిజం పేరుతో పబ్బం గడుపుకొనే బీజేపీ తెలంగాణలో ఏ గుడికైనా ఒక్క రూపాయి ఇచ్చిందా? బండి సంజయ్ ప్రమాణం చేసిన యాదాద్రికి 100 రూపాయలైనా ఇచ్చారా? ఎమ్మెల్యే కొనుగోలుకు వచ్చినోళ్లే చెప్తున్నరు కదా బీఎల్ సంతోష్, అమిత్ షా పేర్లు. తమ పాత్ర లేదని వాళ్లిద్దరినీ యాదాద్రి దేవాలయానికి వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి. బండి సంజయ్ని కరీంనగర్ ఎంపీగా గెలిపించింది ఎందుకు? మసీదులు తవ్వుదాం.. అక్కడ శవం ఎల్లితే మీది.. శివ లింగం ఎల్లితే మాది అని చెప్పేటందుకా? శవాలు తవ్వేందుకేనా ఎంపీగా గెలిపించింది. నిజాం పేరు చెప్పకుండా? ఇస్లాం పేరు చెప్పకుండా? బీజేపీకి ఓటడిగే దమ్ముందా? మసీదులు తవ్వేటోళ్లు కావాల్నా? పంటలకు కాల్వలు తవ్వేటోళ్లు కావాల్నా? అనేది మునుగోడు ప్రజలే ఆలోచించుకోవాలి.
ఓటుకు తులం బంగారం?
మునుగోడులో గెలిచేందుకు బీజేపీ అన్ని కుట్రలు చేస్తున్నది. బలం లేకనే కేంద్రం నుంచి బలగాలను దింపుతున్నరు. ఒక ఉపఎన్నికకు 16 వేలమంది సెంట్రల్ ఫోర్సు అవసరమా? ఇక ఓటును పైసలిచ్చి, ప్రలోభపెట్టి కొనేందుకు చూస్తున్నరు. ఒక్కో ఓటుకు తులం బంగారం ఇచ్చేందుకు బీజేపీ సిద్ధపడినట్టు తెలిసింది. అక్కచెల్లెళ్లకు నేను చెప్పేది ఒక్కటే.. బంగారమిస్తే తీసుకోండి. పైసలిస్తే తీసుకోండి. కానీ ఓటు మాత్రం కేసీఆర్కు, కారు గుర్తుకే వేసి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించండి.
ఆ పార్టీతో పొత్తు ఎవరి అడిగారు…
టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోబోమని రాహుల్ గాంధీ చెప్పడమే విచిత్రం. ఆయనతో పొత్తును ఎవరు అడిగారు. అసలు ఆయన పార్టీ ఎక్కడ ఉంది. ఆయన భ్రమల్లో ఉండి మాట్లాడుతున్నారు. హుజూరాబాద్లో 3వేల ఓట్లు తెచ్చుకున్న పార్టీతో ఎవరు పొత్తు పెట్టుకుంటరు? కాంగ్రెస్తో పొత్తు కోసం ఇక్కడ ఎవరూ వెంపర్లాడడం లేదు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాదు.. కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలి. అసలు బీజేపీ విషయంలో కాంగ్రెస్ నీతి ఏంటి? మేమేమో ఇక్కడ బీజేపీతో అమితుమీ పోట్లాడుతున్నం. కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉంటున్నది. ఎన్నికలున్నటువంటి, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో రాహుల్ పాదయాత్ర ఎందుకు చేయడం లేదు. ఇద్దరి మధ్య గల రహస్య ఒప్పందం ఏమిటి?
బ్రహ్మాస్త్రం కేసీఆర్
రాష్ట్రంలో మోదీ విసిరిన బాణాలు అనేకం తిరుగుతున్నయి. కానీ ఆ బాణాలకు తెలియంది ఏమిటంటే.. మా వద్ద బ్రహ్మాస్త్రం ఉన్నదని. తెలంగాణ ప్రజల చేతిలో కేసీఆర్ అనే బ్రహ్మాస్త్రం ఉన్నది. ఆయన ఉన్నంత వరకు తెలంగాణను ఎవరూ ఏమీ చేయలేరు. మేం ముందే చెప్పినం.. మా దారిలో వచ్చే వారితో కలిసి పనిచేస్తామని. ఇప్పుడు కమ్యూనిస్టులు మా దారిలోకి వచ్చారు. అదేవిధంగా దేశంలో కొనసాగుతున్న నరేంద్రమోదీ అనే దుర్మార్గ వ్యక్తి పాలనకు చరమగీతం పాడాలంటే, ఆయన్ను ఎదుర్కోవడానికి కలిసి పని చేస్తున్నాం. ఇది భవిష్యత్తులోనూ కొనసాగుతుంది.
ఉద్యోగులారా.. ఉపేక్షించొద్దు
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగులను కూడా అవమానిస్తున్నారు. అసలు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు తెలంగాణ కోసం ఎంత చేశాయో అయనకేం తెలుసు. ఉద్యమంలో టీఎన్జీవో తప్ప మరొకటి లేదు. ఉద్యోగ గర్జనతో ఉద్యమానికి ఊపిరి ఊదింది. మిమ్మల్ని అవమానిస్తున్న బీజేపీ నేతలను ఉపేక్షించొద్దు. కేంద్రంలోనీ బీజేపీ సర్కారు అరాచక పాలనకు చరమగీతం పాడాల్సిందే. ఇందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. బీఆర్ఎస్తో ముందడుగు వేశారు. బీఆర్ఎస్కు మునుగోడు నుంచే మంచి ఫలితం వస్తుంది.ఢిల్లీ
బీజేపీ.. గల్లీ బీజేపీ.. సిల్లీ నాటకం…
ఎమ్మెల్యేల కొనుగోలు విషయం దేశమంతా చూస్తున్నది. మునుగోడులో రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరుతున్నప్పుడు అమిత్షానే స్వయంగా చెప్పిండు. మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్రెడ్డిని గెలిపిస్తే నెలరోజుల్లో ప్రభుత్వాన్ని పడగొడతమని అన్నరు. ఆ గైడ్లైన్ల ప్రకారమే అంతా జరిగింది. ఆ పెద్దల సహకారమే లేకుంటే వందలకోట్లు ఎక్కడి నుంచి వచ్చినయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు నడిపేంత ధైర్యం ఆ దొంగ స్వాములకు ఎక్కడిది? అన్ని టేపులు, వీడియోలు బయటికొచ్చినయి. బీజేపీ ఎంత నీచానికి దిగిందంటే.. బ్రోకర్లకు స్వామిజీ వేషాలు వేసి రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నది. హిందూయిజాన్ని అవమానిస్తున్నది.
1) మోదీ తెలంగాణకు ఎనిమిది మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు
2) తెలంగాణకు గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్
3) మోదీ ధైర్యంగా కరోనా వ్యాక్సిన్ కనుగొన్నారు.