హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బంజారాహిల్స్లోని బంజారా భవన్లో శుక్రవారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ బంజారా ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ నెల 17న హైదరాబాద్లోని సేవాలాల్ మహారాజ్ బంజారా భవన్ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మునుగోడుకు చెందిన బంజారా ప్రతినిధులు ఈ భవన్ను చూసి, తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోనున్నారు.
గిరిజనుల అభ్యన్నతికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన ప్రతినిధులకు వివరించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతితోపాటు గిరిజన ప్రజాప్రతినిధులు, ట్రైకార్, జీసీసీ చైర్మన్లు రామచంద్రనాయక్, వాల్యానాయక్ తదితరులు పాల్గొననున్నారు. ఈ భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కోటా, గిరిజనబంధు, పోడు భూముల శాశ్వత పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ విధాన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.