మునుగోడు ఎన్నికలో ఘన విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీజేపీపై బీఆర్ఎస్ తొలి విజయం ఇది. కెసీఆర్ జాతీయ రాజకీయాల జైత్ర యాత్రకు ఓటు రూపంలో మద్ధతు పలికిన మునుగోడు ప్రజలది విప్లవాత్మకమైన నిర్ణయం అని ఆయన కొనియాడారు. ఇది ప్రజాస్వామ్య విజయం. మునుగోడు ప్రజల విజయం అన్నారు ప్రశాంత్ రెడ్డి. ఈ ఎన్నికతో సీఎం కేసీఆర్ వెంటే తెలంగాణ అని మరోసారి రుజువైందని, టీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి జరుగతుందని, ఎప్పటికైనా తెలంగాణలో కారుదే జోరని స్పష్టం చేశారు మంత్రి.కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి, దేశానికి శ్రీరామ రక్ష అన్నారు. ప్రభుత్వాలను కూలదోసె కుట్రలు చేస్తున్న బీజేపీకి ఓటుతో మునుగోడు ఓటర్లు గుణపాఠం చెప్పారని, బీజేపీ చెంప చెల్లుమనిపించిన మునుగోడు ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. మునుగోడు ఉప ఎన్నిక విజయాన్ని గుజరాత్ గులాంలకు తెలంగాణ సలాం చేయదని తేల్చి చెప్పిన విజయంగా వర్ణించారు. ఈ విజయం తెలంగాణ ఆత్మగౌరవ విజయమని, ఇదీ కేసీఆర్ విజయమని చెప్పారు ప్రశాంత్ రెడ్డి.