Munugode | కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఏలుబడిలో మునుగోడు నియోజకవర్గం తీవ్ర అన్యాయానికి గురయ్యింది. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. ఫ్లోరైడ్ బారిన పడి ఇక్కడి ప్రజల నడుములు వంగిపోతున్నా.. ఆనాడు ఏ ఒక్క నాయకుడూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగారు కానీ.. మునుగోడు ప్రజలను మాత్రం నిలువునా ముంచేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మునుగోడును అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఆరేండ్లలోనే అరవై ఏండ్ల అభివృద్ధి జరిగింది. మంచినీటి ప్లాంటును నిర్మించారు. ఇంటింటికీ శుద్ధ నీటిని సరఫరా చేస్తున్నారు. ఫ్లోరైడ్ పీడ విరగడయ్యింది. లక్షలాది మంది ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కొత్తగా ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదు.
మునుగోడు నియోజకవర్గానికి 2014 కంటే ముందు పదిసార్లు ఎన్నికలు జరిగాయి. ఐదుసార్లు కాంగ్రెస్, ఐదుసార్లు కమ్యూనిస్టులు విజయం సాధించారు. వీళ్ల హయాంలో మునుగోడు అనేక సమస్యలకు కేంద్రంగా ఉండేది. భూగర్భ జలాలు అడుగంటిన ఈ నియోజకవర్గం ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతంగా మిగిలిపోయింది. లక్షలాది మంది ప్రజలు ఫ్లోరైడ్ పీడితులుగా మారిపోయారు. కాళ్లు, నడుములు వంకరపోయి, పండ్లు గారలు పట్టి దివ్యాంగులుగా మారారు. సాగునీరు లేక, వర్షాలు పడక, పంటలు పండక భూములన్నీ పడావు పడ్డాయి. ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్, ముంబయికి జనం వలస పోయారు ప్రధాన రహదారులన్నీ సింగిల్ రోడ్లుగానే ఉండేవి. అంతర్గత రహదారుల గురించి పట్టించుకున్న నాథుడు లేడు. చేనేత కార్మికులను ఆదుకునేవారు, ప్రోత్సహించేవారు లేక ఆత్మహత్యలు, ఆకలిచావులకు గురయ్యారు. 2014కు ముందు ఇలా అనేక కష్టాలను చూశారు మునుగోడు ప్రజలు.
2014లో మొదటిసారి ఇక్కడి ప్రజలు కాంగ్రెస్, కమ్యూనిస్టులను పక్కనపెట్టి బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించారు. దీంతో మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టింది.
కానీ, 2018 ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విజయం సాధించారు. దీంతో మళ్లీ మునుగోడు అభివృద్ధికి బ్రేకులు పడ్డాయి. కూసుకుంట్ల ప్రారంభించిన పనులను కూడా రాజగోపాల్రెడ్డి కొనసాగించలేకపోయా రు. తమ ప్రభుత్వం లేదని, అభివృద్ధి చేయలేనని చేతులెత్తేశారు. ఇదే సాకును చూపించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేశారు. రాజగోపాల్రెడ్డి చేసిన మోసాన్ని గుర్తించిన మునుగోడు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఏడాది క్రితం మళ్లీ కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించారు. దీంతో మునుగోడులో మళ్లీ ప్రగతి పరుగులు తీస్తున్నది. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఆరేండ్ల కాలంలోనే రూ.3,945.44కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు.
మునుగోడు నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నా గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. కేవలం బల్క్ డ్రగ్ పరిశ్రమలను మాత్రమే ఏర్పాటు చేయించారు. వీటివల్ల మునుగోడు ప్రజల ఆరోగ్యాలు, పర్యావరణానికి నష్టం జరిగింది కానీ ఎలాంటి లాభం జరగలేదు. కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గంలోని దండుమల్కాపూర్లో 500 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసింది. పర్యావరణానికి నష్టం జరుగకుండా దీనిని ఏర్పాటుచేసింది. ఇటీవల ఈ పార్కులో ఒకే రోజు 51 పరిశ్రమలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ పార్కు సమీపంలోనే మరో 100 ఎకరాల్లో టాయ్స్ ఇండస్ట్రీస్ పార్కును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది.