చౌటుప్పల్: మునుగోడు ఉపఎన్నిక వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడుతున్నది. శుక్రవారం హైదరాబాద్లో రూ.కోటి 10 లక్షల హవాలా డబ్బును పోలీసులు సీజ్చేసిన విషయం తెలిసిందే. తాజాగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఓ కారులో రూ.20 లక్షలు లభించాయి. శనివారం ఉదయం టోల్గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వస్తున్న కారులో డబ్బును గుర్తించారు. అయితే ఆ మొత్తానికి సంబంధించి పత్రాలను చూపించకపోవడంతో డబ్బును, కారును పోలీసులు సీజ్ చేశారు. డబ్బును తరలిస్తున్న అభిషేక్ అనే వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు.
కాగా, ఈ నెల 18న మునుగోడు నియోజయకవర్గంలోని గట్టుప్పల్ శివారులో రూ.19 లక్షల నగదు పట్టుబడింది. అంతకుముందురోజు మునుగోడు మండలం చల్మెడ చెక్పోస్ట్ వద్ద ఫ్లయింగ్ స్క్యాడ్ టీమ్కు ఏకంగా కోటి రూపాయల నగదు చిక్కింది. ఇదే చెక్పోస్టు వద్ద ఈనెల 13న ఓ కారులో రూ.13 లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే.