మునుగోడు: మునుగోడు బీజేపీ అభ్యర్థికి ఎక్కడికివెళ్లినా నిరసనసెగ తగులుతున్నది. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ ప్రజలు నిలదీస్తున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా తమ ఊరి మొహం చూడని కోమటిరెడ్డి.. మళ్లీ ఇప్పుడు ఎలా ఓట్లడుగుతావని ప్రశ్నిస్తున్నారు. మొన్న చౌటుప్పల్ మడలంలోని అల్లపురంలో ప్రజలు రాజగోపాల్ రెడ్డికి ఎదురుతిరిగినంత పనిచేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని గెలిపిస్తే, అదిపక్కనబెట్టి కాంట్రాక్టుల కోసం అమ్ముడు పోయావంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
తాజాగా మునుగోడు మండలంలోని సోలిపురంలో మాజీ ఎమ్మెల్యేని ఓటర్లు నిలదీశారు. ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి సోలిపురం చేరుకున్న రాజగోపాల్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ ఊరికి ప్రధాన సమస్యగా మారిన బ్రిడ్జిని సొంతఖర్చుతో నిర్మిస్తానని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని.. ముందు దానిసంగతి చూడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ హామీని నెరవేర్చేవరకు గ్రామంలో ప్రచారం చేయొద్దని అడ్డుకున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి మరో విపక్షంలో చేరారని, మరి ఇప్పుడు నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేస్తే ఏం ప్రయోజనం ఉండదని, సొంత లాభంకోసమే పార్టీ మారారని పెద్దపెట్టున నినాదాలు తీశారు. దీంతో చేసేదేంలేక కోమటిరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.