నాంపల్లి: మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుడు ఉన్నారని గుర్తుచేస్తున్నారు. కూసుకుంట్లను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.
సంస్థాన్ నారాయణపురం మండంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. టీఆర్ఎస్కు ఓట్లేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఇక నాంపల్లి మండలం చిట్టెంపహాడ్లో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్తో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రోడ్ షో నిర్వహిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడు పోయారని విమర్శించారు. ఆయన స్వార్థం వల్లే మునుగోడు ఉపఎన్నిక జరుగుతున్నదన్నారు. నాలుగేండ్లుగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. టీఆర్ఎస్ గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాజగోపాల్ రెడ్డిని ప్రజలు రాజకీయ సమాధి చేస్తారన్నారు.
చండూరు మండలంలోని బంగారిగడ్డ, తుమ్మలపల్లి గ్రామాల్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చండూరు మున్సిపాలిటీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్ వాడవాడనా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.