నమస్తే తెలంగాణ నెట్వర్క్: అగ్రకుల దురహంకారం, డబ్బు మదంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలను అవమానించడం, కించపరిచేలా మాట్లాడటం పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి అలవాటుగా మారిందని మున్నూరుకాపులు, బీసీ సంఘాల నేతలు ఆగ్రహించారు. ఖబడ్దార్ రేవంత్ అని హెచ్చరించారు. శనివారం పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మున్నూరుకాపులు, బీసీ సంఘాల నేతలు భగ్గుమన్నారు. పలుచోట్ల రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
మున్నూరుకాపు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని, కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పొన్నాల లక్ష్మయ్యపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మున్నూరుకాపు సంఘం నేతలు కరీంనగర్, మంచిర్యాల, ఖమ్మంలో, హైదరాబాద్లో బీసీ సంఘం నేతలు.. రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచుతూ దొరికిన దొంగ రేవంత్ అని మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయలేదని, కేవలం బీసీలకు అన్యాయం జరుతుగుతున్నదని, పార్టీలో గౌరవం దక్కడం లేదని ఆవేదనతో రాజీనామా చేస్తే.. వారించాల్సింది పోయి రేవంత్ అహకారంతో మాట్లాడారని ధ్వజమెత్తారు. పదవుల కోసం రేవంత్ దేనికైనా ఒడిగడుతాడని దుయ్యబట్టారు. రేవంత్ బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని, పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు.రేవంత్ తన హోదాను మర్చిపోయి పొన్నాలపై అహంకార భావంతో మాట్లాడటం దారుణమని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు మండిపడ్డారు.
కరీంనగర్లో మున్నూరుకాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్, నాయకులు కర్ర శేఖర్, సంతోష్ పటేల్, రవి, మల్లేశం, సునీల్, మారుతి, మంచిర్యాలలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు నల్ల శంకర్, గౌరవాధ్యక్షుడు గొంగళ్ల శంకర్, నాయకులు గాదె సత్యం, బొలిశెట్టి రాజలింగు, తోట తిరుపతి, సీపతి శ్రీనివాస్, పానగంటి శ్రీనివాస్, తూముల వెంకటరామయ్య, ప్రభాకర్, అగ్గురవి, ఎడ్ల శంకర్, ఖమ్మంలో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు పారా నాగేశ్వరరావు, నాయకులు పుట్టం పురుషోత్తం, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ విజయకుమార్, జాబి శెట్టి శ్రీనివాసరావు, రాపర్తి శరత్, పొన్నం వెంకటేశ్వరావు, పారా ఉదయ్కుమార్, హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్యాదవ్, ఈడిగ శ్రీనివాస్గౌడ్, గూడూరు భాస్కర్, నాగరాజ్గౌడ్, నరసింహ నాయక్, శ్యామల, ఇంద్రం రజక తదితరులు పాల్గొన్నారు.