కరీంనగర్ కలెక్టరేట్ / షాబాద్ ఫిబ్రవరి 5 : ఏపీ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తమకు వేతనాలివ్వాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. సోమవారం మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు పలు జిల్లాలో ధర్నా చేపట్టారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సుమారు గంటకుపైగా నిర్వహించిన మున్సిపల్ కార్మికుల ధర్నాకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్ మద్దతు పలికారు. ఏపీలో మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు వేతనం, హెల్త్ అలవెన్సులు కలిపి నెలకు రూ.24 వేలు, క్యాటగిరీల వారీగా పనిచేస్తున్న కార్మికులకు రూ.21 వేలు చెల్లిస్తున్నారని, అదే విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అసోద రవీందర్, జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు పోచయ్య, నగరపాలక సంస్థ అధ్యక్షుడు కవ్వంపల్లి రవి, హుజురాబాద్, కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాల్టీల అధ్యక్షులు అజ్జు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద..
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి, కార్యదర్శి కిషన్ డిమాండ్ చేశారు.