తిమ్మాపూర్/గన్నేరువరం, జనవరి 14: మునగ చెట్టు రానురానూ వాణిజ్య పంటగా మారిపోతున్నది. మునగకాయలతోపాటు వాటి ఆకులోనూ అనేక ఔషధ గుణాలు ఉండడం, అవి ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తుండటంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలోని రైతు దంపతులు ముత్యాల రజినీ రమణారెడ్డి అందరి కంటే వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. కేవలం మునక్కాయలను అమ్మడమే కాకుండా మునగ ఆకును పొడిగా తయారు చేసి విక్రయించడం ద్వారానూ లాభాలు పొందుతున్నారు.
ఎకరంలో సాగు
వ్యవసాయమే జీవనాధారంగా ముందుకు సాగుతున్న ముత్యాల రజినీ రమణారెడ్డి దంపతులు గతంలో వివిధ రకాల పంటలు వేసినా అంతగా ప్రయోజనం లేకపోయింది. దీంతో కొత్తగా ఏదైనా చేయాలని భావించిన ఆ దంపతులు.. నాబార్డు అధికారుల సూచనతో మునగ తోట సాగు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఏడాది క్రితం తక్కువ ఖర్చుతో ఎకరం భూమిలో మునగ మొక్కలు నాటి, డ్రిప్ ద్వారా నీరు పెడుతున్నారు. సాధారణంగా మునగకు నీరు అవసరం ఉండదు. కానీ, రజినీ రమణారెడ్డి దంపతులు మునగ ఆకును సేకరించి పౌడర్ తయారు చేస్తున్నందున ఎక్కువ నీరు అందిస్తున్నారు. దీంతో ఆకు త్వరగా పెరుగుతున్నది.
వంద గ్రాముల ప్యాకెట్ రూ.100
మునగ ఆకును పౌడర్ చేసి విక్రయించుకునేలా రైతులను ప్రోత్సహిస్తున్న అధికారులు.. అందుకు అవసరమైన యంత్రాలను రజినీ రమణారెడ్డి దంపతులకు అందజేశారు. వీటి సాయంతో వారు మునగ ఆకును పొడిగా తయారు చేసి, 100 గ్రాముల ప్యాకెట్ను రూ.100 చొప్పున స్థానికంగానే విక్రయిస్తున్నారు.
ప్రభుత్వం చొరవ తీసుకుంటే..
మైలారంతోపాటు చిగురుమామిడి మండలం సుందరగిరిలో ఇప్పటికే పలువురు రైతులు నాబార్డు సాయంతో మునగ సాగు చేస్తున్నారు. కానీ, మునగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడంతో రైతులకు లాభాలు నామమాత్రంగా ఉన్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని పాఠశాలల్లో విద్యార్థులకు అంగన్వాడీల ద్వారా గర్భిణులకు మునగ ఆకు పౌడర్ను అందిస్తే పౌష్ఠికాహార లోపాన్ని నివారించడంతోపాటు రైతులకూ లాభం చేకూరుతుంది.
ఎన్నో ఉపయోగాలు
మునగ ఆకు పౌడర్ను రోజూ గ్రాము చొప్పున తీసుకుంటే బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి. పాలు, క్యారెట్, ఓట్స్, అరటి పండ్లు, ఆకుకూరల్లో ఉండే విటమిన్లన్నీ మునగ ఆకు పౌడర్లో లభిస్తాయి. దీని వినియోగంతో ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. పలు రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మునగ ఆకులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్, సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్ కంటే మునగ ఆకులో విటమిన్లు ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయి. థైరాయిడ్ను అదుపులో ఉంచే సహజ ఔషధంగా పేరున్న మునగ ఆకును కంటి వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లోనూ వాడతారు. ఇందులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్తో షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. మునగ ఆకు రసాన్ని పాలలో కలిపి పిల్లలకు అందిస్తే ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు, బాలింతల్లో కాల్షియం, ఐరన్ లోపాన్ని తొలగించేందుకు మునగ ఆకు ఎంతో ఉపయోగపడుతుంది.
అవగాహన పెంచాలి..
మునగ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటిపై ప్రజలకు సరైన అవగాహన లేదు. దీంతో డిమాండ్ అం తంత మాత్రంగానే ఉన్నది. నేను ఎకరం లో సాగుచేసిన మొక్కలతో చాలా పౌడర్ తయారు చేయవచ్చు. కానీ, మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బంది అవుతున్నది. ప్ర భుత్వం చొరవ తీసుకుని మునగ వల్ల కలి గే లాభాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తే మార్కెటింగ్ పెరిగి మాకు మరింత ఆదా యం లభిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకోవాలి.
– ముత్యాల రమణారెడ్డి, రైతు, మైలారం