వరంగల్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సామాన్యుల అవసరాలు ప్రాతిపదికగా పాలన సాగించిన కాకతీయులకు ఏడు అంకెతో విడదీయలేని అనుబంధం ఉన్నదని చరిత్రకారులు పేర్కొంటున్నారు. పాలనా అంశాలు, కోటలు, కట్టడాలు అన్నీ ఏడుతో సంబంధం కలిగి ఉన్నాయని చెప్తున్నారు. ఏడు అంకె ప్రత్యేకత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడో నెలలో ఏడు రోజులపాటు కాకతీయ సప్తాహం నిర్వహించనున్నది. ఈ మేరకు ఈ నెల 7న ఉత్సవాలు ప్రారంభించనున్నది.
కాకతీయుల నాటి ఏడు కోటల్లో ఏడు రోజులపాటు ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు నగరం చుట్టూ మట్టి కోట, పుట్ట కోట, కంప కోట, కంచు కోట, గవని కోట, రాతి కోట, కత్తికోట పేరుతో ఏడు కోటలను నిర్మించారు. ఏడు కోటలు ఉన్నందువల్లే ఓరుగల్లును సప్త ప్రాకార పరివేష్టిత నగరం అని ఏకామ్రనాథుడు రాసిన ప్రతాపరుద్ర చరిత్రలో పేర్కొన్నారు. కాకతీయ కళావైభవానికి నిదర్శనంగా నిలిచిన శిలాతోరణ ద్వారాల్లోని మధ్య భాగంలో ఏడు తామర మొగ్గల్లాంటి నిర్మాణాలు ఉన్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పటిష్ఠ రక్షణ వ్యవస్థ కోసం ప్రతాపగిరి కోట, గొంతెమ్మ గుట్ట, కాపురం గుట్టల వంటి ఏడు గిరి దుర్గాలను సైనిక స్థావరాలుగా నిర్మించారు.
సప్త సంతానాల కల్పన
శైవమతాన్ని ఎకువగా అనుసరించిన కాకతీయులు పరాశక్తి స్వరూపమైన అమ్మవార్లను ఆరాధించారు. పాలనావిధానంలోనూ వీరికి ఏడుతో విడదీయరాని అనుబంధం ఉండేది. ప్రజాసంక్షేమంలో భాగంగా సప్త సంతానాల కల్పన కోసం కృషిచేశారు. వరహాలు, గద్యానం, మాడ, రూక, వెండి పణం, చిన్నం, తార వంటి ఏడు నాణేలను వినియోగించారు. రామప్ప, పాకాల, గణపసముద్రం, లక్నవరం, బయ్యారం, ఉదయ సముద్రం, రంగ సముద్రం కాకతీయులు నిర్మించిన ఏడు పెద్ద జలాశయాలు.
ఓరుగల్లు రాతి కోట పరిధిలో ప్రజల అవసరాల తీర్చేందుకు మెట్ల బావి, ఈసన్న బావి, అకా చెల్లెళ్ల బావి, శృంగార బావి, గడియారం బావి, సవతుల బావి, కోడి కూతల బావి పేరుతో ఏడు మెట్ల బావులను ఏర్పాటుచేశారు. కాకతీయ శిల్ప ఓరుగల్లు రాతి కోట నుంచి మధ్య కోట భాగంలో ప్రసిద్ధి పొందిన శివాలయం, విష్ణు ఆలయం, వేంకటేశ్వర ఆలయం, కొండ మసీదు(ప్రస్తుత పేరు), నేల శంభుని అలయం, అశ్వశాల, వీరభద్ర ఆలయం ఉన్నాయి. ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని వెల్దుర్తిలో కాకతి రుద్రదేవుడు స్వయంగా ప్రతిష్ఠాపన చేసినట్టు చెప్పే గొనె మైసమ్మకి ఏడేండ్లకోసారి ఏడు రోజులపాటు జాతర నిర్వహణ ఆనవాయితీగా వస్తున్నది.