హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): ఎండీఎంఏ సింథటిక్ డ్రగ్ విక్రయిస్తున్న నెట్వర్క్ ముఠాను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్న్యూ) అరెస్టు చేసింది. హైదరాబాద్కు డ్రగ్స్ సరఫరా చేసే మూలాలపై దృష్టి పెట్టింది. గోవాలో డ్రగ్స్ కింగ్పిన్లను హైదరాబాద్ జైల్లో పెట్టిన హెచ్న్యూ.. ఇప్పుడు ముంబై పోలీసుల సహకారంతో అక్కడ డ్రగ్ విక్రేతలపై ఫోకస్ చేసింది. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. మంగళవారం బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మీడియాతో మాట్లాడుతూ హెచ్న్యూ ముంబైలో చేసిన ఆపరేషన్ గురించి వివరించారు. ఎండీఎంఏ సింథటిక్ డ్రగ్ విక్రయిస్తున్న నెట్వర్క్ను ఛేదించేందుకు హెచ్న్యూ రెండు నెలలపాటు ముంబైలో నిఘా వేసి నిందితులను పట్టుకున్నదని చెప్పారు. ఐటీ ఉద్యోగిని సనాఖాన్ డ్రగ్ వినియోగదారుగా ఉంటూ, ముంబైకి వెళ్లి ఎండీఎంఏ డ్రగ్ను రూ.3 వేలకు కొని, హైదరాబాద్లో రూ.7 వేలకు విక్రయిస్తున్న సమాచారంతో ఆమెను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. ముంబై నెట్వర్క్ వెలుగులోకి వచ్చిందని తెలిపారు.
సనాఖాన్తోపాటు కొండాపూర్లో రెస్టారెంట్ నిర్వహిస్తున్న హర్ష మహాజన్ అలియాస్ రాజ్వీర్, ముంబైకి చెందిన జతిన్ బాలచంద్ర భలేరావు, జావెద్ షమ్మిషీర్ అలీ సిద్దిఖీ, జునైద్ షేక్ శంషుద్దీన్, వికాస్ మోహన్ కొడ్మూర్, ఇమ్మాన్యుల్ ఓసుండోలతోపాటు మరో ఘటనలో మెహరాజ్ ఖాజీలను హెచ్న్యూ అరెస్టు చేసిందని సీపీ చెప్పారు. నిందితులు బెయిల్ తెచ్చుకునేందుకు కోట్లు ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి సరఫరా చేస్తున్న మరో గ్యాంగ్ను కూడా హెచ్న్యూ పట్టుకున్నట్టు తెలిపారు. సింథటిక్ డ్రగ్ అయిన ఎండీఎంఏను ముంబైలోని ఓ ప్యాక్టరీలో తయారు చేస్తున్నారని, తయారీదారు నుంచి వినియోగదారుడి వచ్చే వరకు అది కిలో రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల ధర పలుకుతున్నదని వెల్లడించారు. ముంబైలో ఎండీఎంఏను తయారుచేస్తున్న కీలక డ్రగ్ స్మగ్లర్ కోసం గాలిస్తున్నామని చెప్పారు. ముంబైలో డ్రగ్ విక్రయిస్తున్న వారిని అరెస్టు చేసి ఆ విషయాలను అక్కడి కమిషనర్కు పంపించామని, ఆయన కూడా హైదరాబాద్ పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు.
హెచ్న్యూ ఏర్పాటైన ఏడాదిలో 104 కేసులు
హెచ్న్యూ ఏర్పాటైన ఏడాది కాలంలో 104 కేసులు నమోదు చేసి, 12 రకాలైన వివిధ డ్రగ్స్ను సీజ్ చేశామని, దాని విలువ రూ. 6.3 కోట్లు ఉంటుందని హెచ్న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మి చెప్పారు. 202 మందిని అరెస్టు చేశామని తెలిపారు. 1076 మంది వినియోగదారుల్లో 350 మందికి డ్రగ్ ఎడిక్షన్ కేంద్రాల్లో కౌన్సెలింగ్ ఇప్పించామని, అందులో 80 మంది డ్రగ్స్కు పూర్తిగా దూరమై ప్రశాంతంగా ఉన్నారని పేర్కొన్నారు. మిగతా వారికి చికిత్స కొనసాగుతున్నదని చెప్పారు.
అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి లైంగిక దాడులు
ఎండీఎంఏ డ్రగ్ను అమ్మాయిలకు ఇచ్చి, వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు ముంబై డ్రగ్ కింగ్పిన్ విచారణలో వెల్లడైందని సీపీ ఆనంద్ తెలిపారు. హెచ్న్యూ గోవాలో నిర్వహించిన ఆపరేషన్తో నో సేల్ ఇన్ తెలంగాణ, హైదరాబాద్, నో సైప్లె టు హైదరాబాద్ అనే బోర్డులు నెట్లో డ్రగ్ విక్రేతలు ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ఇదే తరహాలో ముంబై నుంచి కూడా హైదరాబాద్కు డ్రగ్ రాకుండా చేస్తామని చెప్పారు. ముంబై నుంచి వచ్చే డ్రగ్స్తో హైదరాబాద్లో 40 మంది, ముంబైలో 70 మంది వినియోగదారులను గుర్తించామని తెలిపారు. హైదరాబాద్లోని వినియోగదారుల పరిస్థితిని బట్టి వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ చేయడం, పునరావాస కేంద్రాలకు పంపడంపై చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.