మంగపేట, నవంబర్ 11: ములుగు జిల్లా మంగపేటకు చెందిన బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన.. 150 మంది అనుచరులతో కలిసి శనివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మూడేండ్ల నుంచి ములుగు నియోజకవర్గంలోని పల్లెపల్లెనా బీజేపీని బలోపేతం చేశానని తెలిపారు.
ములుగు టికెట్ తనకే ఇప్పిస్తామని పార్టీ అగ్రనేతలు లక్ష్మణ్, గరికపాటి మోహన్రావు ఆశ చూపి బీజేపీలో చేర్పించినట్టు వాపోయారు. టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపంలో ఉన్న తనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గానీ, మరే ఇతర నాయకుడు గానీ కనీసం ఫోన్ కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను నమ్ముకున్న వారి నిర్ణయం మేరకు బీజీపీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.
అనుచరులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని కృష్ణ వివరించారు. ఈ సమావేశంలో బీజేపీకి చెందిన వివిధ విభాగాల నాయకులు అల్లె జనార్దన్, కొండూరు నరేశ్, గద్దల రఘు, గూడబోయిన సురేశ్, నరేందర్, రతన్సింగ్, నారాయణ, లొంకరాజు, హరిబాబు, తిరుమల్, శేఖర్, భాస్కర్, సావిత్రి, శ్రీనివాసాచారి పాల్గొన్నారు.