ములుగు, ఆగస్టు 7(నమస్తేతెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృ ష్టించిన న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మూలగుండ్ల మల్లారెడ్డి హత్య కేసును ములుగు పోలీసులు ఛేదించారు. ఆదివా రం ములుగులో ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మల్లంపల్లిలోని మైనింగ్ భూములకు సంబంధించిన పలు వివాదాల్లో నర్సంపేటకు చెందిన గోనెల రవీందర్, మల్లంపల్లికి చెందిన పిండి రవియాదవ్, కొడిశలకుంటకు చెందిన వంచ రామ్మోహన్రెడ్డికి న్యాయవాది, మైనింగ్ వ్యాపారి మల్లారెడ్డితో కొన్నేండ్లుగా తగాదాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మల్లారెడ్డిని హత్య చేసేందుకు పథకం వేసి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన ఆర్ఎంపీ, విలేకరి తడుక రమేశ్ కు 2020లో రూ.18 లక్షల సుపారి ముట్టజెప్పారు. దీంతో తడుక రమేశ్ తన గ్రామానికి చెందిన నైనాల శివతోపాటు హనుమకొండ జిల్లా గంగిరేణిగూడేనికి చెందిన పెరుమాండ్ల రాజు, పెరుమాండ్ల రాకేశ్తోపాటు ఏపీలోని కర్నూలు జిల్లా కొక్కెరంచ వాసి ఈడిగ జయరాం, ఈడి గ వేణు, నంద్యాల జిల్లా పాములపాడుకు చెందిన బుక్క వెంకటనారాయణ ఈ హత్య పథకాన్ని అమలు చేశారు. ఈ నెల ఒకటిన పందికుంట వద్ద దారికాచి మల్లారెడ్డిని కత్తులతో పొడిచి చంపారని ఎస్పీ తెలిపారు. హత్యకు సూత్రధారులైన గోనెల రవీందర్, పిండి రవియాదవ్, వంచ రామ్మోహన్రెడ్డి, తడుక రమేశ్ను అరెస్టు చేసి శనివారం రిమాండ్కు తరలించగా, ప్రత్యక్షంగా పాల్గొన్న పెరుమాండ్ల రాజు, రాకేశ్, నైనాల శివ, జయరాం, వేణు, వెంకటనారాయణను ఆదివారం అరెస్టు చేశామన్నారు.