హైదరాబాద్ : సాంకేతిక విద్యలకు ధీటుగా అటవీ విద్యకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఫారెస్ట్ కాలేజీ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (FCRI) ను 2016లో నెలకొల్పారు. ఇప్పడు అదే కాలేజీ యూనివర్సిటీగా అప్ గ్రేడ్ అవుతోంది. రష్యా, చైనా తర్వాత ప్రపంచంలో ఫారెస్ట్ యూనివర్సిటీ మన ములుగులోనే ఉన్నది.
హైదరాబాద్ సమీపంలో ములుగు వద్ద అత్యాధునిక సౌకర్యాలు, ఆధునిక భవనాలతో పాటు అటవీ విద్యకు అవసరమైన అన్ని హంగులతో ఇప్పటికే క్యాంపస్ సిద్దంగా ఉంది. 2016లో మొదట దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ప్రారంభమైన కాలేజీ, ముఖ్యమంత్రి చొరవతో హైదరాబాద్ సమీపంలో ఉన్న ములుగు క్యాంపస్కు మారింది. దేశంలోని ఏ యూనివర్సిటీ, కాలేజీ క్యాంపస్లకు తీసిపోని విధంగా, సర్వ హంగులు, ఆధునిక సౌకర్యాలతో ఫారెస్ట్ కాలేజీ కొనసాగుతోంది. ఇప్పుడు యూనివర్సిటీగా మార్పుతో ఇదే ఫారెస్ట్ కాలేజీ, దేశంలోనే మొదటి ఫారెస్ట్ యూనివర్సిటీగా మారబోతోంది. అందుకు అవసరమైన మౌళిక సదుపాయాలు, పాలన, నియామకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
అంతర్జాతీయంగా పర్యావరణ మార్పులు, జీవవైవిధ్యానికి పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అటవీవిద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాగే ఈ క్యాంపస్ నుంచే జాతీయ స్థాయి పర్యావరణ నిపుణులు, అఖిల భారత స్థాయి అధికారులు రావాలనేది సీఎం ఆకాంక్ష. అందుకు తగినట్లుగానే మొదటి బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు బీఎస్సీ ఫారెస్ట్రీ విద్యను అభ్యసించిన విద్యార్థులు అటు అమెరికా యూనివర్సిటీలతో పాటు, దేశంలోనే పేరెన్నిక గల డెహ్రాడూన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఐకార్ లాంటి చోట్ల ఉన్నత చదువులు చదువుతున్నారు. ఇటీవలే ఒక విద్యార్థి ఐఎఫ్ఎస్ కూడా సాధించారు.
ముఖ్యమంత్రి ఓఎస్డీగా మొదటి నుంచి సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంక వర్గీస్, ఫారెస్ట్ కాలేజీ డీన్గాను కొనసాగుతున్నారు. తన పర్యవేక్షణలో కాలేజీ జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించటంతో పాటు, ఇప్పుడు దేశంలోనే మొదటి ఫారెస్ట్ యూనివర్సిటీగా మారబోతోంది. పచ్చదనం పెంపు, పర్యావరణ హిత రాష్ట్రం కోసం తెలంగాణకు హరితహారం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి, చాలా ముందు చూపుతో ఫారెస్ట్ కాలేజీని నెలకొల్పారని, ఇప్పుడు యూనివర్సిటీగా ప్రభుత్వం అప్ గ్రేడ్ చేయటం గొప్ప విషయమని ప్రియాంక వర్గీస్ అన్నారు. అటవీ విద్యకు ప్రాధాన్యత పెరగటంతో పాటు, గ్రామీణ యువతకు మంచి అవకాశాలు దక్కుతాయన్నారు.