హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అటవీశాఖ కల్పిస్తున్న సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని ఇందిరాగాంధీ జాతీయ ఫారెస్ట్ అకాడమీ (ఐజీఎన్ఎఫ్ఏ) డైరెక్టర్ భరత్జ్యోతి పేర్కొన్నారు. దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ, ములుగు అటవీ కళాశాల అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ రాణిస్తున్నాయని ప్రశంసించారు. శుక్రవారం ఆయన ఫారెస్ట్ అకాడమీ, అటవీ కళాశాలను సందర్శించారు. వివిధ రాష్ర్టాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఎంపికైన అధికారులు, ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్న దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో సౌకర్యాలు, విద్యా బోధన, క్షేత్రస్థాయి శిక్షణ వంటి అంశాలను పరిశీలించారు. ములుగు కళాశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులు అద్భుతంగా ఉన్నాయని అభినందించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన తరగతి గది, అధునాతనమైన లైబ్రరీ, ల్యాబ్లు, కాలేజీ క్యాంపస్లోనే 150 ఎకరాల విస్తీర్ణంలో హాస్టల్ వసతి, పరిశోధనలకు వీలుగా అటవీ క్షేత్రాల వంటి వసతులు కల్పించడాన్ని ఆయన ప్రశంసించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచస్థాయి నిపుణులను తయారుచేయాలనే ఉద్దేశంతో ములుగు ఫారెస్ట్రీ కళాశాలను ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్ ముందుచూపు అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం ఫారెస్ట్ అకాడమీ ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ, అకాడమీ డీన్ ప్రియాంక వర్గీస్, డిప్యూటీ డైరెక్టర్ ఏ నర్సింహారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం అరణ్యభవన్లో అటవీశాఖ ఉన్నతాధికారులతో భరత్ జ్యోతి సమావేశం కానున్నారు.