Telangana | ములకలపల్లి, మార్చి 1: గతంలో వేలాది ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాజెక్టు అది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాంతంలో 45 ఏండ్ల క్రితం నిర్మించిన చిన్నతరహా సాగునీటి మూకమామిడి ప్రాజెక్టు. చిన్నదే అయినా మండలానికి పెద్ద ప్రాజెక్టుగా ఉంటూ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది. రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. వ్యవసాయపరంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే ఈ ప్రాజెక్టు వల్లేనని చెప్పాలి. సుమారు 3,200 ఎకరాల పైచిలుకు ఆయకట్టు కలిగిన ప్రాజెక్టు ఇది. అలాంటిది నేడు సాగునీరు లేక వెలవెలబోతున్నది. ప్రాజెక్టును నమ్ముకున్న రైతుల పొలాలు బీళ్లుగా మారాయి. నిరుడు పచ్చని పంటలతో కళకళలాడిన ఆయకట్టు.. ప్రస్తుతం నెర్రెలుబారింది.బీఆర్ఎస్ ప్రభుత్వం లో మూకమామిడి ప్రాజెక్టు ఎప్పుడూ జలకళతో నిండుకుండలా ఉండేది. రెండు పంటలకు నీరందిస్తూ రైతులపాలిట వరదాయినిలా ఉండేది.
ప్రస్తుతం డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో రైతులు యాసంగికి దూరంగా ఉన్నారు. గేట్ల లీకేజీ సమస్యతో నీరు నిల్వ ఉండటం లేదు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. భారీగా పూడిక పేరుకుపోయినా ఆ ఊసెత్తడం లేదు. బోర్లు, మోటర్లు ఉన్నా నీరు సరిపోక కొద్దోగొప్పో వేసిన పంటలు సైతం ఎండిపోతున్నా యి. ప్రస్తుత యాసంగిలో పట్టుమని 50 ఎకరాల్లో కూడా సాగుచేయడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గేట్లు, ఇతరత్రా మరమ్మతుల కోసం గత ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించింది. ప్రస్తుతం ప్రాజెక్టును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని మరమ్మతులు చేపట్టి, వచ్చే వానకాలం నాటికైనా ప్రాజెక్టులో నీరు ఉండేలా చూడాలని రైతులు కోరుతున్నారు.