హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోంది. విద్యార్థి ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుంటామని ఊరూరా తీర్మానాలు చేస్తున్నారు. గెల్లుకే తమ మద్దతు అంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. ఇక గెల్లు శీనుకు ముదిరాజ్ల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తోంది.
కమలాపూర్ మండలం గూడూరు గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు టీఆర్ఎస్ పార్టీకే జై కొట్టారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండల ఇంచార్జి పేరియాల రవీందర్ రావు సమక్షంలో ముదిరాజ్ సంఘం నాయకులు గులాబీ గూటికి చేరారు. వీరందరికీ బాల్క సుమన్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పాక లక్ష్మీ రవీందర్, టీఆర్ఎస్ నాయకులు మామిడిశెట్టి శేఖర్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఏనాడు ముదిరాజు కులస్థులను పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. అన్ని కులాలను గౌరవిస్తూ వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి టీఆర్ఎస్ పార్టీలో చేరామని తెలిపారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో గాలిబ్ శంకర్, ముత్తయ్య, నటరాజ, తెప్ప కుమారస్వామి, అబ్బనబోయిన వెంకటస్వామి, తెప్ప భద్రయ్య, వీరస్వామి, సాంబమూర్తి, రవీందర్, నరహరి, సాంబయ్య, దేవునూరి రవిలతో పాటు పలువురు ఉన్నారు.