ఖైరతాబాద్, నవంబర్ 17 : ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్టు మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ హాజరవుతారని వెల్లడించారు. గురువారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ వేడుకల రోజు పల్లెపల్లెన ముదిరాజ్ జెండా ఎగురవేసి తమ ఐక్యతను, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెబుతామని పేర్కొన్నారు.
వివిధ రంగాల్లో నిష్ణాతులైన టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్, టీవీ యాంకర్, నటుడు కావలి రవి అలియాస్ బిత్తిరి సత్తి, జబర్దస్త్ కళాకారుడు అవినాశ్, ఉమెన్ ఆంత్రాప్రెన్యూర్ మర్రి లక్ష్మి,జానపద గాయకురాలు కనకవ్వ, న్యాయవాది డీఎల్ పాండు, న్యాయవాది, పాత్రికేయుడు పిట్టల రాజా రమేశ్, ముదిరాజ్ తెలంగాణ ఐటీ సంఘం అధ్యక్షుడు సందీప్ మక్తాలా తదితరులను సత్కరిస్తామని వివరించారు. సమావేశంలో కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ దినేశ్ కుమార్, మహాసభ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అల్లుడు జగన్, రాష్ట్ర కార్యదర్శి మర్రి ప్రభాకర్, యూత్ కోఆర్డినేటర్ బొక్క శ్రీనివాస్ , లీగల్ అడ్వయిజర్ చంద్రశేఖర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డీ కనకయ్య, అంబర్పేట్ సతీశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.