సిద్దిపేట : సిద్దిపేటలో ఎన్నిక ఏదైనా ఏకగ్రీవం అని మరో సారి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు నిరూపించారు. ఒక వైపు పట్టణ ప్రజలు, మరో వైపు పలు గ్రామాల్లో కుల సంఘాలు ఏకతాటి పైకి వచ్చి మంత్రి హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీకి జై కొడుతున్నారు. మేమంతా మంత్రి వెంటే ఉంటామని జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన ముదిరాజ్ కుల సంఘాల నేతలు ఆదివారం మంత్రి హరీశ్ రావును కలిసి ఏకగ్రీవ తీర్మానాలు అందజేశారు.
అభివృద్ధి ప్రదాత మంత్రి హరీశ్ రావు వెంటే మేమంతా అంటూ.. సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్న గుండవెళ్లి గ్రామ మత్స్య కారుల సహకార సంఘం, ఇరుకోడ్ గ్రామ హనుమంతుపల్లి ముదిరాజ్ సంఘం, సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్ ముదిరాజ్ సంఘం నేతలు, సభ్యులు మంత్రికి జైకొట్టారు. ఇలా సిద్దిపేట నియోజకవర్గంలో ఏకగ్రీవ తీర్మానాల పర్వం కొనసాగుతున్నది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రజల ఆదరణ, ఆప్యాయత గుండెల్లో పెట్టుకుంటాను. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసమే పాటుపడుతానని స్పష్టం చేశారు. అంతా ఏకతాటి పై వచ్చి ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం పట్ల బీఆర్ఎస్ పార్టీ పై వారికి ఉన్న నమ్మకానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.