నిజామాబాద్/మంచిర్యాల, నవంబర్ 3, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కనుచూపు మేరలో జనమే.. కనిపించేంత దూరం గులాబీ వనమే.. దిక్కులు పిక్కటిల్లేలా నినాదాల హోరు.. చిందేసి ఆడిన జనజోరు.. ఇవీ శుక్రవారం సీఎం కేసీఆర్ హాజరైన ప్రజాఆశీర్వాద సభల తీరు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో, జగిత్యాల జిల్లా కోరుట్లలో, నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని భైంసాలో శుక్రవారం జరిగిన ప్రజాఆశీర్వాద సభలకు జనం పోటెత్తారు. ఊరూరూ ఏకమై.. ఉప్పెనలా కదిలి.. కడలి తరంగాల వలె గులాబీ జెండాలతో తరలివచ్చిన జనం, బీఆర్ఎస్ శ్రేణులతో ఆ సభలు దద్దరిల్లాయి. ఆర్మూరు, కోరుట్ల, ముథోల్ నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆశన్నగారి జీవన్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, విఠల్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలకు స్వచ్ఛందంగా వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.
సభలతో ఆయా పట్టణాలతోపాటు పరిసరాలన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రసంగాలను జనం ఆసక్తిగా విన్నారు. కేసీఆర్ మాటలకు ప్రజలు చప్పట్లతో మద్దతు పలికారు. ఆయన ఒక్కో మాటల తూటాలకు జనం నుంచి జేజేలు మిన్నంటాయి. గాయని మధుప్రియ, ఇతర కళాకారుల ఆటపాటలతో వేదికలపై ముఖ్య నేతలు పదం పాడుతూ కదం తొక్కి సందడి చేశారు. దీంతో సభా ప్రాంగణాల్లోని జనమంతా లేచి ఉరకలెత్తే ఉత్సాహంతో స్త్రీ, పురషులు, చిన్నా, పెద్ద అంతా నృత్యాలు చేస్తూ మురిసిపోయారు. గులాబీ కండువాలు, మ్యానిఫెస్టో ప్లకార్డులు, కేసీఆర్, కారు గుర్తు ఫొటోలు ప్రదర్శిస్తూ గులాబీ శ్రేణులు సంబురం చేసుకున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ సభలతో పార్టీ సత్తాను చాటిచెప్పారు.