హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల అభివృద్ధి, పారిశ్రామిక కేంద్రాల ఆధునీకీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా చేయూతనిస్తున్నదని పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణభాస్కర్ తెలిపారు. బాలానగర్లోని ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్, ఫెసిలిటేషన్ కార్యాలయ ప్రాంగణంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కు శుక్రవారం తొలిరోజు ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణభాస్కర్.. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈలకు సూచించారు.
తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఎంఎస్ఎంఈలకు మరింత ప్రోత్సాహం అవసరమన్నారు. వివిధ ప్రాంతాల్లోని కామన్ ఫెసిలిటీ సెంటర్లకు అత్యాధునిక సాంకేతికతను అందించాలని, పారిశ్రామిక పారులను అప్గ్రేడ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ అదనపు కమిషనర్ డీ చంద్రశేఖర్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం ఎస్వీఎస్ఎన్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.