పెంట్లవెల్లి, ఫిబ్రవరి 21 : ఎస్సీ వర్గీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే మోకాలడ్డుతున్నదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి, మండల అధ్యక్షుడు బత్తిని కురుమయ్య ఆరోపించారు. ఈ మేరకు.. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాగోస, కార్నర్ మీటింగ్లను, సభలో ఆ పార్టీ రాష్ట్ర నేత, మాజీ ఎంపీ వివేక్, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్రావు ప్రసంగాలను అడ్డుకున్నారు. దీంతో కమలం పార్టీ, ఎమ్మార్పీఎస్ నేతల మధ్య ఘర్ష ణ తలెత్తి.. బీజేపీ ప్రజాగోస, కార్నర్ మీటింగ్ సభలు రసాభాసగా మారాయి. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు యత్నించినా లాభం లేకపోయింది.
దీంతో చేసేది లేక సభ మధ్యలోనే ప్రసంగాన్ని నిలిపేసి వివేక్, ఎల్లేని వెళ్లిపోతుండగా.. స్పష్టమైన సమాధానం చెప్పాలని ఎమ్మార్పీఎస్ నేతలు వారి కాన్వాయ్ని వెంబడించారు. ఆగ్రహించిన దండోరా నాయకులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ అధిష్ఠానానికి మాజీ ఎంపీ వివేక్ తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. వివేక్ దళితుల ద్రోహి అని మండిపడ్డారు. వర్గీకరణ విషయంలో స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. బీజేపీ నాయకులు మీటింగ్ ఎలా నిర్వహిస్తారని ధ్వజమెత్తారు. అధికారులు బీజేపీ సభలకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. ఎస్సై రామేశ్వర్రెడ్డి కల్పించుకొని ఎమ్మార్పీఎస్ నాయకులకు సర్దిచెప్పగా.. వారు శాంతించడంతో గొడవ సద్దుమణిగింది.