ముషీరాబాద్, నవంబర్ 11: ప్రధాని మోదీ మాదిగలను మళ్లీ మోసం చేశారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ హామీ ఇస్తారని మాదిగల సభ పెడితే మోదీ వర్గీకరణ ఊసెత్తకుండా రాజకీయ ఉపన్యాసం చేసి ధోకా ఇచ్చారని ఫైరయ్యారు. రాజకీయ అవసరాల కోసం మాదిగలను బీజేపీ వాడుకుంటున్నదని చెప్పారు. విద్యానగర్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై త్వరలో కమిటీ వేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడం దాటవేత ధోరణికి నిదర్శనమని, మాదిగలు బీజేపీని ఇక నమ్మబోరని స్పష్టంచేశారు. గతంలోనే పలు కమిషన్లు ఎస్సీ వర్గీకరణ చేయాలని నివేదికలు ఇచ్చినా మళ్లీ కమిటీ అని ప్రధాని మోదీ చెప్పడం మాదిగలను మోసం చేయడమేనని మండిపడ్డారు. ప్రధాని మాట్లాడుతుండగానే ఓ మహిళ వర్గీకరణ కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, మోదీ మాటతీరు నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు. ఓట్ల కోసమే మాదిగల విశ్వరూప సభ నిర్వహించారని, మంద కృష్ణమాదిగ బీజేపీకి మద్దతుగా, మాదిగలను ఓటు బ్యాంక్గా మార్చాలని చూస్తున్నారని ఆరోపించారు. స్వార్థ, వ్యక్తిగత రాజకీయాల కోసం తెలంగాణ మాదిగ జాతిని మంద కృష్ణ బీజేపీకి తాకట్టు ఆక్షేపించారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొల్లూరు వెంకట్, వరిగడ్డి చందు, తిరుమలేశ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.