మర్రిగూడ, అక్టోబర్ 31: బీఎస్పీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడలో సోమవారం నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. నిత్యం దళితులపై దాడులు చేస్తూ మతం పేరుతో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే మతతత్వ బీజేపీకి బీఎస్పీ సహకరిస్తున్నదని ఆరోపించారు. దళిత వ్యతిరేక బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపై దాడులు రెట్టింపయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాలే చెబుతున్నాయన్నారు. నిత్యం దాడులు జరుగుతుంటే బీఎస్పీ ఎందు కు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్చేశారు. మాదిగల చిరకాల కోరిక ఏబీసీడీ వర్గీకరణను వ్యతిరేకించిన పార్టీ బీఎస్పీ అని గుర్తుచేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మనువాద వ్యవస్థను తిరిగి తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదన్నారు.
ఇంత జరుగుతున్నా ఏనాడూ బీఎస్పీ క్షేత్రస్థాయిలో ఒక్క పోరాటం కూడా చేయకపోవటం దారుణమని మండిపడ్డారు. మునుగోడులో కాంగ్రెస్ నుంచి గెలిచిన రాజగోపాల్రెడ్డిపై ఐటీ సోదాలు జరిపి, లొంగదీసుకుని రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టి రాజీనామా చేయించి ఉప ఎన్నికలు తెచ్చారని దుయ్యబట్టారు. 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఎస్పీ గెలవలేకపోయిందన్నారు. ఎస్పీతో పొత్తు పెట్టుకొని 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 10 సీట్లను బీఎస్పీ గెలుచుకున్నదని గుర్తు చేశారు. బీజేపీ ఒత్తిడి మూలంగా 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సానం కూడా గెలుచుకోలేకపోయిందని పేర్కొన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా పోరాడుతుంటే.. బీఎస్పీ ఉద్దేశపూర్వకంగానే పోరాటాలు చేయకుండా ప్రేక్షకపాత్ర వహిస్తూ బీజేపీకి మద్దతు ఇస్తున్నదని దుయ్యబట్టారు. ఇటీవలి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బీఎస్పీ ప్రత్యక్షంగానే సహకరించిందని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి రాజకీయపక్షాలు ముందుకొచ్చాయని, ఇందులో భాగంగానే దళిత బహుజన వ్యతిరేకి బీజేపీని కూకటి వేళ్లతో పెకిలించాలని ప్రజలకు పిలుపునిచ్ఛారు. బీజేపీని ఓడించి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న, నాయకులు చిలకమర్రి గణేశ్, బుసిపాక నర్సింహ తదితరులు పాల్గొన్నారు.