మషీరాబాద్, ఏప్రిల్ 10 : మాదిగనని చెప్పుకొని ముప్పై ఏండ్లుగా రాజకీయ పబ్బం గడిపిన కడియం శ్రీహరి మాదిగల అవకాశాలకు గండికొట్టి మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. బుధవారం హైదరాబాద్ విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొలుత మాదిగనని, టీఆర్ఎస్లో చేరిన తరువాత బైండ్ల కులమని చెబుతూ వచ్చిన కడియం తన వాస్తవ కులమేమిటో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కడియం తన కులం ఏమిటో శీల పరీక్ష చేసుకోవాలని అన్నారు. ఆయన మాదిగల అవకాశాలను లాక్కొంటున్నారని ఆరోపించిన సీఎం రేవంత్రెడ్డి అదే కడియంని కాంగ్రెస్లో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. కడియం పద్మశాలినా, లేక బైండ్లనా ఏ కులం అని నిర్ధారించుకొని పార్టీలో చేర్చుకున్నారో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మందకృష్ణ మాదిగ కడియం చర్యలను ప్రశ్నిస్తూ మాట్లాడితే వారికి అవగాహన, అర్హత లేదని మాట్లాడుతున్న ఆయన ఏ అర్హతతో మాదిగల గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
తాను ఎమ్మార్పీఎస్ ఉద్యమకారుడినని చెబుతున్న కడియం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక్క సీటు ఇవ్వకున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మతం మారి, వేరే రాష్ర్టానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న కడియం కావ్యకు మాదిగలు పోటీ చేయాల్సిన వరంగల్ ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కడియం తన కులం విషయంలో సమాధానం చెప్పకపోతే ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా అడ్డుకొంటామని హెచ్చరించారు.
తన బిడ్డకు టికెట్ ఇప్పించుకొని అసలైన మాదిగలకు మోసం, ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డికి మాదిగల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వరంగల్ టికెట్ మాదిగలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి, నాగర్కర్నూల్ టికెట్ల విషయంలోనూ అధిష్టానం ఆలోచనను మార్చుకోవాలని, లేనిపక్షంలో గాంధీభవన్, పార్లమెంట్ అభ్యర్థుల ఇండ్లముందు చావుడప్పు కొడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పెట్టపెంజర రమేశ్, శ్యామ్రావు తదితరులు పాల్గొన్నారు.