హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తున్న బీజేపీపై యుద్ధం చేస్తామని, ప్రతి పల్లెలో ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని టీఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, ఏపీ అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించిన ధర్నాలో వారు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ మాదిగ, మాదిగ ఉపకులాల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నదని అన్నారు. వర్గీకరణ సాధన కోసం ఎంతకైనా సిద్ధమని, కేంద్రంలోని బీజేపీపై యుద్ధం చేస్తామని ప్రకటించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ధర్నాలో కర్ణాటక అధ్యక్షుడు ఓబుల కృష్ణ, ఉపకులాల అధ్యక్షుడు డకలి మంగేశ్ తదితరులు పాల్గొన్నారు.