Telangana | తెలంగాణలో మెజార్టీ శాతం ఉన్న మాదిగలను విస్మరించిన కాంగ్రెస్కు మాదిగలను ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఓట్ల కోసం మాదిగ పల్లెలకు వస్తే తరిమి కొడుతామని హెచ్చరించారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాదిగల ఆగ్రహానికి గురైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అన్నారు. కాంగ్రెస్ చర్యలతో మాదిగల్లో తీవ్ర నైరాశ్యం నెలకొందని, తమ వాటా హక్కులను అడిగితే మా వేళ్లతో మా కళ్లనే పొడిపిస్తున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో మాదిగలకు అవకాశం ఇవ్వాలని, ప్రకటించిన స్థానాలను మార్చి రెండు పార్లమెంటు సీట్లతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటును మాదిగలకు కేటాయించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు పెద్ద పీట వేస్తుందని విమర్శించారు. తమ ఓట్లతో నాయకుడిగా ఎదిగిన రేవంత్రెడ్డి మాదిగలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే మాల కావడం వల్లే మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం మాదిగ పల్లెలకు రావద్దని, వస్తే జరిగే పరిణామాలకు వారే బాధ్యులు అవుతారని హెచ్చరించారు.