ఎర్రవల్లి చౌరస్తా, నవంబర్ 14 : బీఆర్ఎస్తోనే దళితజాతి అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్గార్ హుస్సేన్ అన్నారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి బలపర్చిన అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి విజేయుడి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన ఉన్నదని తెలిపారు.
తద్వారా ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్టు స్పష్టం చేశారు. దళితుల అభ్యున్నతికి అంబేద్కర్ తర్వాత అంతగా ఆలోచించిన మేధావి కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీలో ఎస్సీవర్గీకరణ బిల్లు ప్రవేశపెడుతామని హామీ ఇచ్చి మాట తప్పిందని ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని, ఆ పార్టీలకు మాదిగ, ఉపకులాలు ఒక్క ఓటు కూడా వేయొద్దని బల్గార్ హుస్సేన్ కోరారు.