హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం నియమించిన సబ్ కమిటీ.. ప్రజాసంఘాలు, పౌర సమాజం నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు ఏర్పాటుచేసిన ఈ మెయిల్ ఐడీ పనిచేయకుండానేగడువు ముగిసింది. మూసీ అభివృద్ధి ప్రాజెక్టుపై ప్రజలు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలిపేందుకు musirdc@gmail.com, musirrdc@gmail.com పేర్లతో ఉన్న ఈమెయిల్ ఐడీలను ఏర్పాటుచేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఓ సమావేశంలో వెల్లడించారు. ఈ ఈ-మెయిల్ ద్వారా మార్చి 31 నుంచి ఏప్రిల్ 15వరకు అభిప్రాయాలను పంచుకోవాలని గడువు విధించారు. అయితే ఈమెయిల్ ఐడీ పని చేస్తున్నదా లేదా అని చూసుకోవడం మాత్రం మరచిపోయారు. ఈ విషయాన్ని ప్రజాసంఘాలు ఆ మరుసటి రోజునే ఎంఆర్డీసీఎల్ దృష్టికి తీసుకెళ్లినా.. సబ్ కమిటీలో ఎలాంటి చలనం లేదని కొందరు నాయకులు వాపోయారు.
తప్పుడు ఈమెయిల్ ఐడీ ఎందుకిచ్చినట్టు?
హైదరాబాద్ ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపే మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సాగుతున్నదనే విమర్శలు మొదటి నుంచి వ్యక్తమవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రాజెక్టు చేపడుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత గోప్యంగా పనులు కొనసాగిస్తున్నది. లక్షలాది మందిని నిర్వాసితులను చేసే ఈ ప్రాజెక్టు పట్ల ఇప్పటివరకు శాస్త్రీయంగా అభిప్రాయసేకరణ చేపట్టలేదు. కనీసం నిర్వాసితులతో సర్కారు నేరుగా మాట్లాడింది లేదు. కానీ మూసీ ప్రాజెక్టుపై సర్కార్ ఏర్పాటుచేసిన సబ్ కమిటీతో అభిప్రాయాలను పంచుకునేందుకు ఎంఆర్డీసీఎల్ అధికారులు తప్పుడు ఈమెయిల్ ఐడీని ఎందుకు ఇచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని కనీసం అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో.. ప్రజల నుంచి వచ్చిన వందలాది ఈమెయిల్స్ డిస్పోజ్ అయినట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను మూసీ డెవలప్మెంట్ ఆథారిటీతో పంచుకొనే వీల్లేనప్పుడు ఈ ప్రాజెక్టులో పారదర్శకత ఎక్కడ ఉన్నదనీ, ఎందుకు గోప్యంగా ప్రాజెక్టు చేపడుతున్నారనే ప్రశ్నలను నగరవాసులు లేవనెత్తుతున్నారు.
అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు 15 రోజుల గడువునిచ్చిన కాంగ్రెస్ సర్కార్.. అందుకు వీల్లేకుండా తప్పుడు ఈమెయిల్ ఐడీని ఇచ్చింది. ఈ నెల 15తో ఆ గడువు కూడా ముగిసింది. దీంతో ప్రజాభిప్రాయాలకు తావు లేకుండా, సర్కార్ అనుకున్న విధంగా ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలోనే పబ్లిక్ డొమైన్లో ప్రాజెక్టు వివరాలు, డీపీఆర్ సారాంశం, బడ్జెట్ వంటి విషయాలను కూడా ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు.