కందుకూరు, అక్టోబర్ 18 : రంగారెడ్డి జిల్లా కందుకూరు ఎంపీవో కల్యాణి ఆదేశాల మేరకు రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి నరేందర్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వివరాల ప్రకారం.. హైదరాబాద్, కొంపల్లికి చెందిన ఎన్ మధుసూదన్రెడ్డి రాచులూరు గ్రామ సమీపంలో సిమెంట్ ఇటుకల పరిశ్రమ పెట్టాడు. పరిశ్రమకు అనుమతులు లేవని, ఆ అనుమతులు ఇవ్వడానికి ఎంపీవో కల్యాణి, రాచులూరు పంచాయతీ కార్యదర్శి నరేందర్ రూ.5 లక్షలు డిమాండ్ చేశారు.
తన వద్ద అంత డబ్బు లేదని మధుసూదన్రెడ్డి చెప్పగా, చివరగా రూ.2.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో బాధితుడు 11న ఏసీబీని ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు మధుసూదన్ బుధవారం తన పరిశ్రమ వద్ద కార్యదర్శి నరేందర్కు 2.5 లక్షలు ఇస్తుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాచులూరు పంచాయతీ కార్యాలయంలో నరేందర్తో పాటు కల్యాణిని అధికారులు విచారించారు. విచారణ అనంతరం వారిని రిమాండ్కు తరలిస్తామని డీస్పీ భద్రయ్య తెలిపారు.