హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): విపక్షాలపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న కేంద్రం తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడతామని బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత స్పష్టం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు దమ్ముంటే అదానీపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ పట్ల తమకు అపార గౌరవం ఉన్నదని, అందుకే ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారని తెలిపారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్ మాదిరిగా తాము కేసులకు భయపడి పారిపోయే బాపతు కాదని తేల్చిచెప్పారు.
మోదీ సర్కార్ ప్రజావ్యతిరేక విధానాలపై యుద్ధం ప్రకటించిన బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నదని, దీన్ని జీర్ణించుకోలేకనే ఎమ్మెల్సీ కవితతోపాటు మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథిరెడ్డిపైకి దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉసిగొల్పిందని మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా అదానీకి 6 విమానాశ్రయాలను కట్టబెట్టడం, శ్రీలంకతో మోదీ మధ్యవర్తిత్వం నెరపడంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.