హైదరాబాద్, ఆగస్టు 22, (నమస్తే తెలంగాణ): పెట్రోలియం, సహజవాయువు వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన సేవలను అందించాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయన యాత్రలో భాగంగా ముంబైలో నిర్వహించిన రెండో రోజు సమావేశానికి శనివారం ఆయన హాజరయ్యారు . స్థాయీ సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రే తరరే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పెట్రోల్, డీజిల్, సహజవాయువు రంగాల పనితీరు, వినియోగదారులకు అందుతున్న సేవలపై అధికారులతో విసృ్తతంగా చర్చించారు.
ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, సత్వర పరిషారం చూపాలని కోరుతూ సమావేశంలో కీలక సూచనలు చేశారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించే సతాట్ పథకం అమలుపై పెట్రోలియం, ఆర్థిక శాఖల అధికారులు, బ్యాంకింగ్ ప్రతినిధులతో సమీక్షించారు. కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్రాజెక్టుల ఏర్పాటుకు తగిన రుణ సౌకర్యాలు కల్పించడంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోలియం, సహజవాయువు రంగాల్లో ప్రైవేట్ వ్యాపారుల పాత్ర, పురోగతిపై స్థాయీ సంఘం సభ్యులు ప్రత్యేకంగా సమీక్షించారు.