హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): జీవవైవిధ్యంతో అలరారుతున్న 400 ఎకరాల హెచ్సీయూ భూములను పరిరక్షించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై, ఎంపీలందరిపైనా ఉన్నదని చెప్పారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తు అవసరాల కోసం విలువైన ఆ భూములను వినియోగించాలని సూచించారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిలువరించాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన హెచ్సీయూ భూముల అంశాన్ని మరోసారి లేవనెత్తారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ సభ్యులు అడ్డుకోవాలని చూసినా, ఆయన ఏ మాత్రం తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తప్పుడు వైఖరిని ఎండగట్టారు.
ఇదే అంశంపై మొన్న రాజ్యసభలో మాట్లాడిన ఎంపీ రవిచంద్ర.. ఆ భూములను రక్షించాలని కోరుతూ నిన్న సహచర ఎంపీలు, బీఆర్ఎస్ నేతలతో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ 400 ఎకరాల భూముల్లో అరుదైన వృక్ష, జంతు, పక్షి జాతులు, భారీ రాళ్ల వరుసలు ఉన్నాయని తెలిపారు. వాటిలో జింకలు, నెమళ్లు, తాబేళ్లు, సరీసృపాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని చెప్పారు. ఆ భూములను చెరబడితే జీవజాలం మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
కాంక్రీట్ జంగిల్గా మారిన హైదరాబాద్ నగరంలోని ఓ వైపు పరిసర ప్రాంతాలకు ఈ ప్రాంతమే సహజ వాయువును అందజేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఇలాంటి భూములను వేలం వేసేందుకు అందులో ఉన్న భారీ వృక్షాలను రాత్రిపగలు అనే తేడా లేకుండా జేసీబీలు, ప్రొకె్లైనర్లతో యథేచ్ఛగా నరికేస్తున్నారని మండిపడ్డారు.
వద్దని అడ్డుపడుతున్న విద్యార్థులు, అధ్యాపకులపై పోలీసులు లాఠీచార్జి చేస్తూ భయాందోళన సృష్టిస్తున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా సభకు సమర్పిస్తానని ఎంపీ రవిచంద్ర తెలిపారు. వృక్షాలను నరికివేస్తూ పచ్చదనాన్ని, పర్యావరణాన్ని విధ్వంసం చేసే హకు ఎవరికీ లేదని, ఆ భూములను వేలం వేయకుండా, అన్యాక్రాంతం కాకుండా కేంద్ర సర్కారు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.