హైదరాబాద్: వాతావరణ సమతుల్యాన్ని, ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ఉద్యమ స్ఫూర్తితో 17 కోట్ల మొక్కల్ని నాటించడం అభినందనీయమన్నారు. మొక్కల్ని నాటడం ద్వారా మనతోపాటు భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతందని పేర్కొన్నారు. మంగళవారం రవిచంద్ర పుట్టినరోజు సందర్భంగా కేబీఆర్ పార్కులో ఆయన మొక్కల్ని నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
మానవాళిని పట్టి పీడిస్తున్న భూతాపాన్ని, వాతావరణ కాలుష్యాన్ని పారదోలేందుకు పెద్ద ఎత్తున మొక్కల్ని నాటడం, నాటించడం, వాటిని పరిరక్షించడం అత్యవసరం అని చెప్పారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు ఎంపీ సంతోష్ కుమార్ ఉద్యమ స్ఫూర్తితో మొక్కల పరిరక్షణను చేపడుతున్నారన్నారు. ఇప్పటివరకు 17కోట్ల మొక్కల్ని నాటించి, వాటిని పరిరక్షిస్తున్న సంతోష్ కుమార్కు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజుతో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, కాపునాడు జాతీయ అధ్యక్షులు తాడివాక రమేష్ నాయుడు, మున్నూరుకాపు ప్రముఖులు కొండా దేవయ్య, సర్థార్ పుట్టం పురుషోత్తంరావు, ఆవుల రామారావు, ఉరుమడ్ల నర్సింహ, ఊసా రఘు, గుండ్లపల్లి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.