Green India Challenge | జగిత్యాల, జూలై 15, (నమస్తే తెలంగాణ): కొండగట్టులో 1,094 ఎకరాల అడవిని దత్తత తీసుకొన్న గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ భక్తుల ఆహ్లాదం కోసం అర్బన్ ఫారెస్ట్ను నిర్మించేందుకు సంకల్పించారు. ఇందుకోసం తన ఎంపీ నిధులనుంచి రూ.1.04 కోట్లను కేటాయించి, పనులను ప్రారంభించారు. గ్రీన్ చాలెంజ్ ఐదేండ్లు పూర్తి చేసుకొని, ఆరో ఏట అడుగు పెడుతున్న తరుణంలో శనివారం ఆయన కొండగట్టు పుణ్యక్షేత్రం ఉన్న రిజర్వు ఫారెస్ట్ దత్తత కార్యక్రమంతోపాటు అటవీ అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం శ్రీకారం చుట్టారు. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్ను ప్రారంభించారు. ఎంపీ నిధుల నుంచి రూ.1.04 కోట్లను మంజూరు చేసిన ఎంపీ సంతోష్కుమార్ ఆ మేరకు ప్రొసీడింగ్ కాపీలను అటవీశాఖ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్కుమార్ మాట్లాడుతూ, మూడు మొకలతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రజా భాగస్వామ్యంతో నేడు మహోద్యమంగా మారిందని వెల్లడించారు. ఆధ్యాత్మిక కొండగట్టుకు హరిత సొబగులు అద్దడమే లక్ష్యంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. కొండగట్టును సందర్శించే భక్తులు సేదతీరేందుకు వీలుగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఫారెస్ట్ పార్కును తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఎంపీ నిధుల నుంచి కోటి 4 లక్షల 85వేలు కేటాయించినట్టు చెప్పారు. అటవీ ప్రాంతానికి రక్షణ కంచె, వాకింగ్ ట్రాక్, వాచ్ టవర్, గజిబోలు తదితర నిర్మాణాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. సీఎం మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించామని, ఐదేండ్లలో పర్యావరణ రక్షణ, ప్రకృతి పునరుద్ధరణకు పాటుపడటం అత్యంత సంతృప్తిని కలిగించిందని చెప్పారు. విచ్చలవిడిగా పెరిగిన ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలు, కాలుష్యం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన పెంచడం, పచ్చదనం వృద్ధిలాంటి కార్యక్రమాలను ఆరో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రాధాన్యతగా పెట్టుకొన్నట్టు వెల్లడించారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని సృష్టించే లక్ష్యంతోనే ముందుకు సాగుతామని తెలిపారు. కొండగట్టు సమీపంలోని జేఎన్టీయూకు చెందిన 4 వేల మంది విద్యార్థులు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటేందుకు రావడం సంతోషంగా ఉందని, వారందరూ అభినందనీయులని పేర్కొన్నారు. సకల రంగాల్లో అభివృద్ధితోపాటు హరిత, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లే తెలంగాణను సీఎం కాంక్షిసున్నారని చెప్పారు.
హరిత కొండగట్టుగా అభివృద్ధి
కొండగట్టు ఆంజనేయ క్షేత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. అటవీ, దేవాలయాల ప్రేమికుడైన ఎంపీ సంతోష్కుమార్ సీఎం కేసీఆర్ ఆశయాన్ని సాధించే క్రమంలో భాగంగా అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుని హరిత కొండగట్టు అభివృద్ధికి పాటుపడుతున్నట్టు చెప్పారు. ఎంపీ నిధులనుంచి రూ.1.4 కోట్లు కేటాయించడం సంతోషదాయకమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ 265 కోట్ల మొకలు నాటామని, ఈ ఏడాది మరో 25 కోట్ల మొక్కలు నాటనున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి ముందు సంతోష్కుమార్తోపాటు మంత్రులు అల్లోల, గంగుల కమలాకర్, సీఎస్ శాంతికుమారి, సీఎంవో అధికారులు భూపాల్రెడ్డి, ప్రియాంక వర్గీస్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్సింగ్, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, మాకునూరి సంజయ్కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్రావు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు.
విత్తన బంతులు విసిరిన సంతోష్కుమార్
కొండగట్టు రిజర్వ్ ఫారెస్ట్లో మొక్కలు నాటిన అనంతరం రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్.. కొండగట్టు రిజర్వ్ ఫారెస్ట్లోని వాచ్ టవర్ పైకి ఎకి అటవీ అందాలను వీక్షించారు. సుమారు అరగంటకుపైగా వాచ్ టవర్పైనే గడిపారు. ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి ప్రకాశ్ సీతాఫల విత్తనాలతో తయారుచేసిన అటవీ బంతుల ప్రాధాన్యతను ఎంపీ సంతోష్కుమార్కు వివరించి, ఆయనకు అందజేశారు. వాటిని అటవీ ప్రాంతంలోకి సంతోష్కుమార్ విసిరారు. విత్తన బంతులతో చిక్కటి అడవి ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.