హైదరాబాద్ : పచ్చని వాతావరణంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిసరాలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రాణవాయువును అందిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ డెవలప్ మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ సహకారంతో ఉస్మానియాలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్క్ను ఓయూ వీసీ ఆచార్య డి. రవీందర్తో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం వీసీ, రిజిస్ట్రార్, ఓఎస్డీతో కలిసి ఆక్సిజన్ పార్క్ లో కలియ తిరిగారు.
మొమిన్ చెరువు అభివృద్ధి, ఇతర మౌలిక వసతుల కల్పనపై ప్రొఫెసర్ రవీందర్.. సంతోష్కు వివరించారు. సమగ్ర నివేదిక( డీపీఆర్) తో వస్తే ఆక్సిజన్ పార్క్ సహా ఉస్మానియా ఆవరణలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తానని ఈ సందర్భంగా వీసీకి ఎంపీ హామీ ఇచ్చారు.
200 రకాల ఔషధ మొక్కలు, చెట్లతో ఆక్సిజన్ పార్క్ ను అభివృద్ధి చేశామని వీసీ తెలిపారు. వెయ్యికి పైగా నెమళ్లు ఈ పార్క్ లో ఉన్నాయని..వాటి సంరక్షణతో పాటు బయోడైవర్సిటీకి ఓయూ కేంద్రంగా ఉందని స్పష్టం చేశారు. ఓజోన్ డే సందర్భంగా ఓజోన్ పార్క్ ముందు ఎంపీ సంతోష్, వీసీ, రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, ఓఎస్డీ రెడ్యానాయక్ మొక్కలు నాటారు.