హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): బొగ్గు, విద్యుత్తును అందిస్తూ దేశంలో వెలుగులు పంచుతున్న ఘనత తెలంగాణకే దక్కిందని పార్లమెంటరీ పార్టీ బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఉద్ఘాటించారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే అభివృద్ధి చెందడం ఎలాగో తమకు తెలుసని పేర్కొన్నారు. పర్యావరణం, అడవుల పరిరక్షణపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో వద్దిరాజు పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని సింగరేణి కాలరీస్ సంస్థ సుస్థిర మైనింగ్కు నిలయమని చెప్పారు. ‘మనం వికసిత భారత్-2047 దిశగా అడుగులు వేస్తున్నాం. ఈ ప్రయాణంలో పర్యావరణ శాఖ అంటే అనుమతులిచ్చే ఆఫీసు మాత్రమే కాదు.. ఇది మన దేశాభివృద్ధికి దిక్సూచి లాంటిది’ అని వద్దిరాజు అభివర్ణించారు. పర్యావరణ అనుమతుల కోసం ఉన్న పరివేష్ 2.0 పోర్టల్ను మరింత సులభతరం చేయాలని కేంద్రాన్ని కోరారు. దీనిని కేవలం అనుమతులిచ్చేందుకే పరిమితం చేయకుండా, మైనింగ్ పూర్తయ్యాక ఆ భూముల్లో అడవుల పునరుద్ధరణకు సాంకేతిక సాయం అందించేలా తీర్చిదిద్దాలని కోరారు.
హరితహారం దేశానికి ఆదర్శం
కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన హరితహారంతో రాష్ట్రంలో అడువుల విస్తీర్ణం 7% పెరిగిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వివరించారు. ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. కొత్తగూడెం, మణుగూరు లాంటి ప్రాంతాల్లో క్రూరమృగాలతో వ్యవసాయానికి, రైతులకు నష్టం జరుగుతున్నదని, దీనిని అరికట్టేందుకు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుచేయాలని, బాధిత రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, రైల్వే డివిజన్ ప్రాజెక్టుల విషయంలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే పనుల్లో వేగం పెంచాలని విజ్ఞప్తిచేశారు.
పర్యావరణ అసమతుల్యతతో కోతుల బెడద
పర్యావరణ అసమతుల్యతతో తెలంగాణలో కోతుల బెడద భయంకరంగా తయారైందని వద్దిరాజు ఆందోళన వ్యక్తంచేశారు. కోతులు గ్రామాలు, పంట పొలాలపై దాడులు చేస్తుండటంతో పంటలు, కూరగాయలు, పూలు, పండ్లు నాశనమవుతున్నాయని, కోతులు ఇండ్లలోకి చొరబడి పసిపిల్లలపై దాడులు చేసి గాయపరుస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది కేవలం రాష్ట్ర సమస్య మాత్రమే కాదని, కేంద్రం దీనిని వన్యప్రాణి-మానవ ఘర్షణ కింద గుర్తించాలని కోరారు. కోతుల పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, ఫలవృక్షాలు నాటేందుకు కాంపా నిధులు వినియోగించాలని సూచించారు.