హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సీఎం రేవంత్రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరి చేరికతో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు మారనున్నట్టు కాంగ్రెస్ వర్గాల సమాచారం. చేవెళ్ల నుంచి ఎంపీ టికెట్ జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డికి, సికింద్రాబాద్ టికెట్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కు ఇస్తారని ప్రచారం జరిగింది. తాజా పరిణామాల వల్ల చేవెళ్ల టికెట్ను రంజిత్రెడ్డికి, సికింద్రాబాద్ స్థానం దానం నాగేందర్కు ఇవ్వనున్నారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. సునీతా మహేందర్రెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు సమాచారం. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీతో కలిసి ఆదివారం సాయంత్రం ముంబైకి వెళ్లారు.