హైదరాబాద్, జనవరి28 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సర్కార్ జనగణనలో కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణనకు ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిని తాము స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ బీసీ భవన్లో నిర్వహించిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ..జనగణనలో కులగణన చేపట్టేందుకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో అన్ని పార్టీలు కలిసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడాన్ని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం దిగిరాకపోతే పార్లమెంటు సమావేశాలు బహిషరించాలని కోరారు. కులగణనతో బీసీలకు విస్తృతమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ తెలిపారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ లాల్ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు రాజేందర్, తెలంగాణ ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, నేతలు గుజ్జ కృష్ణయాదవ్, అంజి, శివకుమార్, రాందేవ్మోదీ, రామాంజనేయులు, శివ గోపి, పర్వతాలు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.