ములుగు, జూలై 30 (నమస్తే తెలంగాణ)/రామడుగు/ఖమ్మం: వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. వరద నష్టాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. వరద బాధితులకు 10 రోజులకు సరిపడా నిత్యావసరాలను అందించామని, పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రభుత్వం వంటకు కావలసిన సరుకులు ఉచితంగా అందిస్తుందని హామీ ఇచ్చారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బూర్గుపేటకు ఆదివారం మంత్రి సత్యవతి కాలినడకన వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. 27 పునరావాస కేంద్రాల్లో 5,400 మందికి భోజన వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలను భరోసా కల్పించాలని విజ్ఞప్తిచేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో వర్షాలకు దెబ్బతిన్న మోతె వంతెనను ఆదివారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వేంకటేశ్వరరావుతో కలిసి వినోద్కుమార్ పరిశీలించారు. మోతె శివారులో కొట్టుకుపోయిన వ్యవసాయ భూములను పరిశీలించారు. కొట్టుకుపోయిన మోతె బ్రిడ్జి స్థానంలో హైలెవల్ వంతెన నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఖమ్మంలో మున్నేరు ముంపు బాధితుల సహాయార్థం రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి రూ.కోటి ఆర్థికసహాయాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ అధికారిక ఖాతాలో జమచేశారు.
భూపాలపల్లి టౌన్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామస్థులకు జీఎంఆర్ ట్రస్టు ఆదివారం సాయం అందించింది. గ్రామంలో 350 కుటుంబాలు ఉండగా, ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జీఎంఆర్ ట్రస్టు చైర్మన్ గండ్ర భూపాల్రెడ్డి, ట్రస్టు ఇన్చార్జి గండ్ర గౌతమ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఇంటింటికీ తిరుగుతూ డబ్బులు, సరుకులు అందజేస్తూ భరోసా నింపారు. మోరంచపల్లిలోని 15 చెంచు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చారు.