న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యపై లోక్సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం టీఆర్ఎస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ సర్కార్ ప్రకటించిందని, ఎనిమిదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వెల్లడించాలని ఎంపీ నామా నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. యువతను మోసంచేసేందుకే రెండు కోట్ల ఉద్యోగాలంటూ ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రలో ప్రస్తుతం 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. విపరీతమైన నిరుద్యోగంతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యోగాల కల్పనపై కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం లేదని ఎంపీ కే కేశవరావు అన్నారు. నిరుద్యోగంపై వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించారని చెప్పారు. అతకుముందు దేశంలో రోజురోజుకి పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధి లేక యువత ఆత్మహత్యలపై చర్చించాలని కోరుతూ టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత ఎంపీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం ఇచ్చారు. దేశంలో నిరుద్యోగ యువతకి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీని అమలు పరచాలని డిమాండ్ చేశారు. దేశ యువతను ఇబ్బoదులకి గురిచేసే కీలక అంశాలపై చర్చ జరపాలని నామ కోరారు. వాయిదా తీర్మానం నోటీస్పై చర్చకు స్పీకర్ అనుమతించక పోవడంతో టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.