నేలకొండపల్లి, మార్చి 25: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా సాగనంపే సమయం వచ్చిందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. సీపీఎం నిర్వహిస్తున్న జనచైతన్య యాత్ర శనివారం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లికి చేరుకున్న సందర్భంగా ఎంపీ నామా యాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు, ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు.
దేశ సంపదను పరిరక్షించేందుకుగానూ 18 పార్టీలు కలిసి జేపీసీని వేయాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను సీపీఎం, సీపీఐలు కలిసి ప్రజాక్షేత్రం లో, గ్రామస్థాయిలో ఎండగట్టాలని సూచించారు. రాహుల్గాంధీపై అనర్హత వేటు హేయమైన చర్యగా పేర్కొన్నారు. దేశంలో ఇది చీకటి రోజు అని, బీజేపీ తప్పుడు పనులను ఖండించాలని తమ్మినేని పిలుపునిచ్చారు.