ప్రభుత్వ దవాఖానల్లో మృతిచెందిన పేద, మధ్యతరగతి కుటుంబాల వారి మృతదేహాలను ఉచితంగా స్వగ్రామాలకు తరలించే పార్థివ వాహన సేవలకు రాష్ట్రవ్యాప్తంగా బ్రేక్ పడే ప్రమాదం కనిపిస్తున్నది. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో వచ్చే నెల ఒకటి నుంచి సేవలు నిలిచిపోనున్నట్టు తెలిసింది. ఇప్పటికే నిర్వహణ సంస్థకు బకాయిలు పేరుకపోవడంతో వాహనాల నిర్వహణ, డీజిల్ ఖర్చులు, సిబ్బంది జీతాల చెల్లింపులు భారంగా మారినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ ఒకటి నుంచి పార్థివ వాహన సేవల నిలిపివేతకు సిద్ధమవుతుండగా పేదలపై మోయలేని భారం పడనున్నది.
కరీంనగర్ విద్యానగర్, ఆగస్టు 18: నాడు ఉమ్మడి రాష్ట్రంలో దురదృష్టవశాత్తూ ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితి విషమించి ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు పేద, మధ్య కుటుంబాలు ఇబ్బంది పడాల్సి వచ్చేది. జిల్లాకేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల పరిధిలో అంబులెన్స్లు ఉన్నా నిర్వహణ సరిగ్గా ఉండేది కాదు. అవి సమయానికి పనిచేసేవి కాదు. కనీసం డీజిల్ కూడా ఉండేది కాదు. ఆ సమయంలో ప్రైవేట్ అంబులెన్స్లపై ఆధారపడా ల్సి వచ్చేది. ఇదే అదునుగా ప్రైవేట్ అంబులెన్స్ల నిర్వాహకులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేది. స్వరాష్ట్రం లో కేసీఆర్ సర్కారు ఈ బాధలను దూరం చేసింది. పేద, మధ్యతరగతి వర్గాలపై భారాన్ని తగ్గించేందుకు 2016 నవంబర్లో రాష్ట్రవ్యాప్తంగా 50 పార్థివ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పూర్తి ఉచితంగా సేవలు అందించింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వా త నిర్లక్ష్యం చేస్తున్నది. పార్థివ వాహనాల నిర్వహణ సంస్థకు రెండేళ్లుగా నిధులు విడుదల చేయడం లేదని తెలిసింది.
దీంతో వాహనాల డీజిల్, మరమ్మతులు, నిర్వహణతోపాటు సిబ్బంది వేతనాల చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలుస్తున్నది. తమ సమస్యలను నిర్వహణ సంస్థ అధికారులు పలుసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిషారం లభించలేదని తెలిసింది. నిధుల కొరత కారణంగా సేవలను కొనసాగించడం కష్టతరంగా మారిందని వివరించినా పట్టించుకోలేదని సమాచారం. చివరకు ప్రభుత్వం నుంచి నిధులు అందకపోతే సేవలను నిలిపివేయాల్సి వస్తుందని దాదాపు ఇరవై రోజుల క్రితమే నోటీస్ ఇచ్చినట్టు తెలిసింది. ఒకవేళ సెప్టెంబర్ ఒకటి నుంచి పార్థివ వాహనా ల సేవలు నిలిచిపోతే ప్రజలు మళ్లీ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరైనా చనిపోతే మృతదేహాలను తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్లపై ఆధారపడాల్సి వస్తుందని, వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభు త్వం వెంటనే స్పందించి బకాయి నిధులను విడుదల చేయడంతోపాటు పార్థివ వాహన సేవలు ఆటంకం కలుగకుండా నిరంతరాయంగా కొనసాగేలా చూడాలని కోరుతున్నారు.
పార్థివ వాహనాల తరహాలో అత్యవసర వైద్య సేవలందించే 108, 102 వాహనాల నిర్వహణకు సంబంధించిన నిధుల విడుదలలోనూ జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తున్నది. భవిష్యత్తులో ఈ సేవల నిర్వహణపైనా ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తున్నది.