హైదరాబాద్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి (Hasanpally) రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడి బాన్సువాడ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను స్పీకర్ పోచారం ఆదేశించారు.
హసన్పల్లి ప్రమాద ఘటన విషాదకరమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడటం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మృతిచెందినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కవిత హామీఇచ్చారు.
నిన్న ఎల్లారెడ్డి మండలం హాసన్ పల్లి గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో తొమ్మిది మంది మృత్యువాత పడటం అత్యంత బాధాకరం. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 9, 2022
కాగా, హసన్పల్లి గేటు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరణమని ప్రధాని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించినవారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 పీఎంఎన్ఆర్ఎఫ్ నిధుల నుంచి అదిస్తామని ప్రధాని చెప్పారు.
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు , క్షతగాత్రులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను . మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుండి అందజేయబడుతుంది. : ప్రధాని మోదీ
— PMO India (@PMOIndia) May 9, 2022
ఆదివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం హసన్పల్లి వద్ద లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడిన విషయం తెలిసిందే.